ఔట్​సోర్సింగ్​ సెక్రటరీల డైలమా

ఔట్​సోర్సింగ్​ సెక్రటరీల డైలమా

ఆసిఫాబాద్, వెలుగు: ఔట్​సోర్సింగ్​పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న ఔట్​ సోర్సింగ్​ పంచాయతీ సెక్రటరీలు ఏటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగం చేస్తున్నామే తప్ప వచ్చే జీతం చాలా తక్కువ అని వాపోతున్నారు. తమతో ఉన్న జేపీఎస్ లు రెగ్యులర్ అయిపోతారు, ఇక మనం ఈ ఓపీఎస్ లుగా ఉందామా.. లేక దీన్ని వదిలేసి వేరే కొలువుల కోసం ప్రిపేర్ అవుదామా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. రోజుకు రూ.500ల  చొప్పున ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ  వేతనం ఇస్తున్నట్టు్నా చెబుతున్నా నెలకు చేతికి వచ్చేది కేవలం రూ.పదివేలు మాత్రమే. ఈ సమయం లో ఓపీఎస్ లు ఉద్యోగం విషయంలో డైలమాలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేయి మందికిపైగా పని చేస్తుండగా ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలో 74 మంది ఉన్నారు.

పనికి తగ్గ వేతనం లేని దుస్థితి..

పేరుకు పంచాయతీ సెక్రటరీ గా జాయిన్ అయినా చేసేది మాత్రం వెట్టి చాకిరేనంటూ ఓపీఎస్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓపీఎస్​లు. జేపీఎస్​లు అయినా ఓపీఎస్​లు అయినా అందరికీ ఒకే జాబ్ చార్ట్ వర్తిస్తుంది. పంచాయతీల్లో చేసే ప్రతి పనిలో సెక్రటరీ పూర్తి బాధ్యత వహించాలి. ఈ సమయంలో ఓపీఎస్ లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుని ఖాళీగా ఉందొద్దని పంచాయతీ సెక్రటరీ గా పరీక్ష రాశారు. దీనిలో మెరిట్ ప్రకారం మొదట జేపీఎస్ లకి ఉత్తర్వులు అందించారు. తర్వాత అనివార్య కారణాల కారణంగా ఖాళీ ఏర్పడిన చోట రోస్టర్ పాయింట్లు ఆధారంగా జాబితాలో ఉన్న వాళ్లకి ఓపీఎస్ గా నియమించారు. దీనికోసం థర్డ్ పార్టీ గా జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించారు. జాబితాలో మెరిట్ తో ఉన్న వాళ్ళను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం చేశారు. వీరికి నెలకు రూ.పదిహేను వేల జీతం ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. కాగా రెండేళ్ల కింద కొలువుల నోటిఫికేషన్ లు లేక నిరుద్యోగులు ఏదో ఒకటి చేద్దాం అని జాయిన్ అయ్యారు. అంతేగాక మెరిట్ ప్రకారం రెగ్యులర్ చేయకపోతారా అని ఆశ పడ్డారు. మారిన పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో ఓపీఎస్ లు జే పీ ఎస్ లుగా నియమితులయ్యారు. అయితే ఆసిఫాబాద్ సహా చాలా జిల్లాల్లో వాళ్ళను జేపీఎస్ లుగా మార్చలేదు. దీంతో ఇప్పుడు రెగ్యులర్ సెక్రటరీ లతో పాటు పని చేస్తున్నా కనీస వేతనం మాత్రం అందడంలేదు. 

చేతికందేది అంతంతే..!

జేపీఎస్ ల పనికి ఇచ్చే జీతానికి మధ్య పొంతన లేకుండా పోయింది. జేపీఎస్ లకు స్టార్టింగ్లో రూ. 18000 జీతం ఇచ్చారు. పీఆర్సీ తర్వాత రూ.29500 కి పెంచారు. అయితే ఓపీఎస్ లకి మాత్రం ఎటువంటి పెరుగుదల లేదు. ఏజెన్సీ ద్వారా నియామకం చేసిన వీరిని ఓ రకంగా ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తోంది. రూ.15వేల జీతంలో కటింగులు(ఈ ఎస్ఐ రూ.450, పీఎఫ్ రూ.3200, ఏజెన్సీ కమిషన్ 3 శాతం) పోను చేతికి వచ్చేది రూ.10500 మాత్రమే. వీటిలో రోజు పంచాయతీ పనులకు, ఫీల్డ్ విజిట్ కోసం బైక్​ఖర్చు సరాసరి రూ.2500 వరకు అవుతుంది. ఈ లెక్కన చూస్తే ఓపీఎస్ లు తన చేతికందేది కేవలం రూ.5000 వేలే. కుటుంబానికి అండగా నిలువలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.18000 కి తగ్గకుండా వేతనం ఇవ్వాలని ఉన్నా అది మాత్రం ఇక్కడ వర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్లంతా వేరే జాబ్ చూసుకోవడం పై ఆసక్తి చూపుతున్నారు. అయితే కాంపిటీషన్ లో ఓపీఎస్ లు జాబ్ కు లీవ్ పెట్టీ ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా లేదు. దీంతో జాబ్ పోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

‘ఇప్పటికే చాలా సమయం గడిచిపోతోంది. ఉందామా.. వేరే జాబ్ కోసం రిజైన్ చేసి పోదామా.. ఎలాగు మనల్ని రెగ్యులర్ చేయరు.. ఉన్నన్ని రోజులు మనతో పని చేయించుకొని పొమ్మంటారు. రెగ్యులర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లు వస్తే మనకి ‘ఖో’ ఇచ్చినట్టే.. ఇక అప్పుడు ఎలాగు మరో జాబ్ కోసం చూడక తప్పదు. ఇప్పుడు సర్కార్ నోటిఫికేషన్ లు వేస్తోంది. ఈ టైం లో మనం చాలీచాలని జీతంతో పొద్దుటి నుంచి రాత్రి దాకా ఉద్యోగం చేయడం అవసరమా’.. అంటూ మదనపడుతున్నారు ఔట్ సోర్సింగ్​పంచాయతీ కార్యదర్శులు(ఓపీఎస్)లు.