- పెరిగిన కరోనా కొత్త వేరియంట్ కేసులు
- ఆందోళనలో బీసీసీఐ!
కాన్పూర్: సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఆ దేశానికి టీమిండియా టూర్పై డైలమా మొదలైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల17 నుంచి ఇండియా, సఫారీ జట్ల మధ్య మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉన్నాయి. ఇందుకోసం ఇండియా టీమ్ 8 లేదా 9న అక్కడికి బయలుదేరనుంది. కానీ టెస్ట్ వెన్యూలు అయిన జొహన్నెస్బర్గ్, ప్రిటోరియాలో కొత్త వేరియంట్ కేసులు పెరగడం బీసీసీఐని ఆందోళనలో పడేసింది. ‘సౌతాఫ్రికాలో వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై సీఎస్ఏ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే ఏదైనా స్టెప్ తీసుకుంటాం. అప్పటివరకు షెడ్యూల్ ప్రకారమే టూర్ జరుగుతుంది. ముంబైలో కివీస్తో మ్యాచ్ తర్వాత టీమిండియా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో జొహన్నెస్బర్గ్ వెళ్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం టూర్ జరిగినా.. గతంలో మాదిరిగా క్వారంటైన్ రూల్స్ను మరింత స్ట్రిక్ట్ చేసే చాన్సెస్ కనబడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న ఇండియా–ఎ టీమ్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికాపై యూకే ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ విధించడంతో.. బ్రిటిష్, ఐరిష్ గోల్ఫ్, రగ్బీ టీమ్లు వెనక్కి వచ్చేశాయి. అలాగే, వచ్చే నెలలో సౌతాఫ్రికాలో జరగాల్సిన వరల్డ్ జూనియర్ విమెన్స్హాకీ టోర్నమెంట్ను నిలిపివేస్తున్నట్టు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ అంశాలు కూడా ఇండియా టూర్పై ప్రభావం చూపే చాన్స్ ఉంది. అయితే గవర్నమెంట్ డెసిషన్ ప్రకారమే తమ నిర్ణయం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.