Dilip Doshi: విరిగిన కాలుతో ఆడిన డెడికేషన్: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

Dilip Doshi: విరిగిన కాలుతో ఆడిన డెడికేషన్: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ లెఫ్టర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్ను మూశారు. సోమవారం (జూన్ 23) 77 ఏళ్ళ వయసులో ఆయన లండన్‌లో గుండెపోటు కారణంగా మరణించారని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. బిషన్ సింగ్ బేడి లాంటి దిగ్గజ స్పిన్నర్ ఉన్నప్పటికీ దిలీప్ దోషి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ మాజీ స్టార్ స్పిన్నర్ మరణించడంతో లీడ్స్ టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్, భారత్ ఆటగాళ్లు కాసేపు మౌనం పాటించారు. మంగళవారం (జూన్ 24) ఆయనకు బీసీసీఐ తమ నివాళులు అర్పించింది. 

ALSO READ | ENG vs IND 2025: రెండు సెంచరీలు కొట్టినా తప్పని శిక్ష: పంత్‌ను మందలించిన ఐసీసీ.. కారణమిదే!

బిషన్ సింగ్ బేడి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 1979 లో భారత టెస్ట్ జట్టులో దిలీప్ దోషి అరంగేట్రం చేశాడు. నాలుగేళ్ల కాలంలో టీమిండియాకు కీలక స్పిన్నర్ గా సేవలను అందించాడు. ఓవరాల్ గా 33 టెస్టుల్లో 114 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కేవలం 28 టెస్ట్‌లలో 100 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం. 1983 తర్వాత దోషి టీమిండియా తరపున ఆడలేదు. ఆస్ట్రేలియాపై 1981 లో జరిగిన మెల్ బోర్న్ టెస్టులో దిలీప్ దోషి విరిగిన కాలితోనే ఆడడం అతని డెడికేషన్ కు నిదర్శనం. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

దిలీప్ కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన నివాళులు అర్పించారు. "దిలీప్ భాయ్ లాంటి గొప్ప మనసున్న ఆటగాడిని నేను చాలా మిస్ అవుతాను. మేము ఎప్పుడూ చేసిన క్రికెట్ సంభాషణలను నేను మిస్ అవుతాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి." అని టెండూల్కర్ తన ఎక్స్ ద్వారా పోస్ట్ చేశాడు. సచిన్ తో పాటు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, హర్భజన్ సింగ్, అనీల్ కుంబ్లే కూడా తమ నివాళులర్పించారు.