
కాగజ్నగర్, వెలుగు : ఫారెస్ట్ ఆఫీసర్లు తమ భూముల్లోకి రావొద్దంటూ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు ఆందోళన బాట పట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు, ట్రెంచ్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుకు నిరసనగా గురువారం భూముల వద్ద టెంట్ వేసి దీక్షకు కూర్చున్నారు.
దశాబ్దాలుగా భూములను సాగు చేసుకొని బతుకుతున్నామని, ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు భూములను చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ సాగులో ఉన్న భూములు ఫారెస్ట్కు సంబంధించినవంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు.
రైతుల దీక్ష విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అక్కడికి చేరుకొని, రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల కోసం రైతులు, మహిళలు పోరాడుతున్నా కనికరం చూపకుండా.. కేసులు పెడుతామనడం సరికాదన్నారు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి అడవిని రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తే ఎంత మందిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. రైతులకు భూములు దక్కే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.