ఎనిమిదేళ్ల క్రితం నిఖిల్ హీరోగా ‘కార్తికేయ’ చిత్రాన్ని తీసి మెప్పించాడు దర్శకుడు చందు మొండేటి. మళ్లీ ఇన్నేళ్లకి ఈ సినిమాకి సీక్వెల్ తీశాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదలవుతున్న సందర్భంగా చందు ఇలా ముచ్చటించాడు.
‘‘కార్తికేయ మూవీకి సీక్వెల్ కావడంతో సినిమా ఆలస్యమైనా పాజిటివ్ బజ్ నెలకొంది. నిధి నిక్షేపాలకు సంబంధించిన అడ్వెంచర్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే నాకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. దైవత్వంలో ఒక భాగమే సైన్స్ అని నమ్ముతాను నేను. పుస్తకాల్లో చదువుకున్నదానికి ఇతిహాసాల్లో ఉన్నదాన్ని మిక్స్ చేయొచ్చుగా అనిపించింది. కృష్ణుడు అనే భావన అనంతం. అందులో నాలుగు భాగాలు తీసుకుని ఇది చేశాం. అసలు కృష్ణుడంటే ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి లాంటివి చర్చించాం. భక్తి, దైవత్వం లాంటి అంశాల్ని నిర్వచించాం. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిసేలా చేసిందీ సినిమా.
గతంలో ఇదే బ్యాక్డ్రాప్లో ‘దేవీపుత్రుడు’ సినిమా వచ్చినప్పటికీ దానికీ దీనికీ సంబంధం లేదు. నా గత అనుభవాల వల్ల కాబోలు, ఈ సినిమా వరుస వాయిదాలు పడినా టెన్షన్ పడలేదు. నాతో పాటు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక గీతా ఆర్ట్స్లో ఒక సోషల్ డ్రామా చేయబోతున్నాను. రెండు కథలు రెడీగా ఉన్నాయి. ఒకటి నాది, మరొకటి ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఒకటి ఫైనల్ అవుతుంది. దాని తర్వాత నాగార్జున గారితో సినిమా ఉంటుంది. జంధ్యాల, శ్రీను వైట్ల తరహాలో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ను తీయాలని ఉంది. హ్యాండిల్ చేయగలనో లేదో అనే భయం కూడా ఉంది.’’