
కమర్షియల్ సినిమాలోనూ ఏదో ఒక సందేశాన్ని మిళితం చేసే దర్శకుడు కొరటాల శివ.. ఈసారి పూర్తిస్థాయి మాస్ కంటెంట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా ‘దేవర’ సినిమాను తెరకెక్కించారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కాంబినేషన్లో శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణ నిర్మించారు. సెప్టెంబర్ 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఇలా ముచ్చటించారు.
మనిషి అన్నాక భయం లేకుండా, మితిమీరిన ధైర్యం ఉండడం మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో ఉన్న భయాన్ని గౌరవించాలని చెప్పడమే ‘దేవర’ సినిమా. లా ఆఫ్ ల్యాండ్ను అందరూ పాటించాలి. ఉదాహరణకు రెడ్ సిగ్నల్ పడగానే ట్రాఫిక్లో ఆగడం, చేసే పనికి జవాబుదారీగా ఉండటం అనేవి మనలో అంతర్లీనంగా ఉండే భయాలు. అలాంటి భయం మనిషికి అవసరమనే విషయాన్ని ఫిక్షనల్ స్టోరీగా చెప్పాం. ప్రీ ప్రొడక్షన్కు 6 నెలలు తీసుకున్నాం. సముద్రం నేపథ్యంలో సినిమా కనుక ఎలా చిత్రీకరించాలి అనే విషయాలపై స్టడీ చేశాం.
లక్కీగా ఈ సినిమాకు అనిరుధ్, రత్నవేలు, సాబు శిరిల్, శ్రీకర ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ కుదరడంతో మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సెకండ్ షెడ్యూల్ టైమ్లో ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పలేమని అర్థమైంది. దాంతో రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయ్యాం. ఇది రెండు భాగాల్లో పూర్తయ్యే కథ. ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా నేర్చుకుని మరీ చేసింది జాన్వీ కపూర్. పదిరోజుల ముందే సీన్ పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేసేది. రూటెడ్ సినిమా కనుక ‘భైర’ పాత్ర తనకు సెట్ అవుతుందో లేదో అని సైఫ్ గారిలో అనుమానం ఉండేది. ఒక స్కెచ్ వేసి పంపాక ఆయన ఆశ్చర్యపోయారు. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఇక అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరికీ ఓ కన్నుల పండుగలా సినిమా ఉండబోతోంది.
ఎన్టీఆర్ గారితో ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయనతో ఏ విషయం చర్చించినా నిర్మొహమాటంగా తన మనసులో మాట చెబుతారు. తన సినిమాకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో టీమ్ అందరం అంత ఎఫర్ట్ పెట్టేశాం. ఇక ఫలితం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్లా ఎక్సయిట్మెంట్, నెర్వస్నెస్ మిక్సుడ్ ఫీలింగ్తో ఉన్నా. ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాగని ప్రెజర్ తీసుకోకుండా, ఈ సినిమాను బాగా తీయాలని ప్రిపేర్ అయ్యాను. అది విడుదలైన 20 రోజుల్లోనే ‘దేవర’ మోషన్ పోస్టర్ రెడీ చేసే పనిలో పడ్డాను. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతావు అంటూ నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి ఆయనకు, నాకు మధ్య విభేదాలు ఏముంటాయి. మా మధ్య ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది... ఉంటుంది.