- ఉస్మానియా వర్సిటీలోవిద్యార్థినుల ఆందోళన
- క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదంటూ ఆగ్రహం
- అన్నంలో పురుగులు రావడంతో ప్లేట్లు పట్టుకుని నిరసన
ఓయూ, వెలుగు: హాస్టళ్లలో నెలకొన్న సమస్యలకు కారణమైన లేడీస్ హాస్టల్ డైరెక్టర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓయూలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మంగళవారం అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం ప్లేటు పట్టుకుని లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్ధినులు మాట్లాడుతూ.. నిర్లక్ష్యం వహిస్తున్న హాస్టల్ డైరెక్టర్ కల్యాణ లక్ష్మి తక్షణమే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. రోడ్డుపై బైఠాయించి హాస్టల్స్ డైరెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. తాము కష్టపడి చదువుతున్నా సరైన తిండి లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నం, కూరల్లో పురుగులు వస్తున్నాయని చాలా సార్లు హాస్టల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ధర్నా చేస్తున్నప్పుడు మాత్రం స్పందించి తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాస్టల్ డైరెక్టర్ కల్యాణ లక్ష్మిని తొలగించి, క్వాలిటీ ఫుడ్ అందించాలని డిమాండ్ చేశారు.