- అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ పెట్టిండు: సీఎం రేవంత్రెడ్డి
- కేసీఆర్ వరి వేస్తే ఉరే అన్నడు.. మేం బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నం
- వాళ్లు పెట్టిపోయిన బకాయిలన్నింటినీ మేం కట్టుకుంట వస్తున్నం
- రైతుల కోసం వాళ్లు నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మేం రూ.6 వేల కోట్లు ఇస్తున్నం
- ఇప్పటి వరకు రైతుల కోసం లక్షా 75 వేల కోట్లు ఖర్చు పెట్టినం
- కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం
- పదేండ్లలో మీరేం చేశారో.. రెండున్నరేండ్లలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్
- ఒకాయన సీఎం రాజీనామా చేయాలంటున్నడు...నీ అయ్య జాగీరా, గడీల ముందు బానిసలమా?
- అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ను ఫామ్హౌస్లో రైతులు బంధించిన్రు
- 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తామని వెల్లడి
- శిల్పకళావేదికలో మంత్రులతో కలిసి రైతు భరోసా నిధుల రిలీజ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తన పదేండ్ల పాలనలో అగ్రికల్చర్, హార్టికల్చర్.. ఇలా అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ తెచ్చిండని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బెల్ట్బజార్లు తెరిస్తే తాము మాత్రం రైతుబజార్లు తెరుస్తున్నామని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన పిల్లలు అంటున్నారని, ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అరుంధతి సినిమాలో పశుపతిని గదిలో బంధించినట్టు.. కేసీఆర్ను రైతులు ఫామ్హౌస్లో బంధించారని, ఆయన బయటకు వస్తే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లను దొంగచాటుగా వినడం తప్ప చేసేదేమీ ఉండదని అన్నారు.
మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. గత 30 నెలల పాలనలో రైతుల కోసం రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.27 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, తాజా విడతతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు రైతు భరోసా రూపంలో అందజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత వానాకాలానికి సంబంధించి రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, అందుకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మేమెందుకు
దిగిపోవాలే.. కేసీఆర్ ఎందుకు రావాలే?
ఒకాయన తనను రాజీనామా చేయాలని అంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఈ కుర్చీ నీ అయ్య జాగీరా..? మేమేమన్నా గడీల ముందు బాని సలమా.. మీరు చెప్తే రాజీనామా చేయడానికి? ’’ అని ఫైర్ అయ్యారు.‘‘కేసీఆర్ మళ్లీ రావాలె అని పిల్ల రాక్షసులు చెప్తున్నరు. నేను అడుగుతున్న. కేసీఆర్ ఎందుకు రావాలే? ఒక్కసారైనా రైతు రుణమాఫీ పూర్తి చేశారా? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ’’ అని ప్రశ్నించారు.
వరేస్తే ఉరే అని కేసీఆర్ బెదిరించాడని, కానీ తాము బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు సన్న వడ్ల బోనస్కు రూ.4 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతుల కోసం వాళ్లు సగటున నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే తాము రూ.6 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల కోసం లక్షా 75 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ‘‘అధికారంలోకి రాగానే 25.35 లక్షల మంది రైతులకు రూ.20 వేల 672 కోట్ల రుణమాఫీ చేశాం. కేసీఆర్ ఎగ్గొట్టిపోయిన రైతు బంధును మేమే చెల్లించాం. ఇందుకు 7 వేలకోట్లు ఖర్చు చేశాం’’ అని వివరించారు. తమ 30 నెలల పాలనలో రైతు తలెత్తుకుని బతికేలా వ్యవసాయాన్ని పండుగగా తీర్చి దిద్దామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే బావ బామ్మర్దులిద్దరూ (హరీశ్రావు, కేటీఆర్) ‘అతని కంటే ఆచంట మల్లన్న అన్నట్టు’.. పోటీపడి పచ్చి అబ్ధాలు చెబుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘ఈసారి ఎల్నినో వల్ల వర్షాలు తక్కువగా పడ్తయ్ అని శాస్త్రవేత్తలు చెప్పిన్రు. అదే విషయం రైతులకు చెప్పి నీళ్ల సౌలతి లేని దగ్గర వరి కాకుండా వేరే పంటలు వేయమన్నం. 7 రకాల సన్న వడ్లకే డిమాండ్ఉందని, మిగితావి కొంటలేరని తెలిసి వాటినే పండించమన్నం. ఆ విత్తనాలు కూడా అందుబాటులో ఉంచినం.
దీనిని కూడా తప్పుపడ్తున్నరు. జీవితాంతం అబద్ధాలు చెప్పాలని, లేదంటే తల వెయ్యి వక్కలవుతుందని కల్వకుంట్ల కుటుంబానికి శాపం ఉంది కావచ్చు’’ అని ఎద్దేవా చేశారు. కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో, రెండున్నర ఏండ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చర్చిద్దామని, దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు.
8.11 లక్షల కోట్ల అప్పు చేసి
ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు..
60 ఏండ్లలో 18 మంది ముఖ్యమంత్రులు రూ.69 వేల కోట్ల అప్పులు చేస్తే, బీఆర్ఎస్ పదేండ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. రూ. 8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్పెట్టారని, ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత వివిధ శాఖల వారీగా అప్పుల లెక్కలు తీసి శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. తవ్విన కొద్దీ అప్పులు బయటపడ్డాయన్నారు. పిల్లల తిండి బిల్లులు, సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టారని చెప్పారు. బిల్లులు పెండింగ్ పెట్టింది కేసీఆర్ అయితే.. ఆ బద్నాం తాను మోశానని, కేసీఆర్ చేసిన అప్పులతో ఢిల్లీలో కూడా పరువు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిల చెల్లించామని, కష్టమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాల్సిందే అని ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. సర్పంచ్లు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాలలు, హాస్టళ్లకు సంబంధించిన బకాయిలను కూడా దశలవారీగా చెల్లించామని తెలిపారు.
మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మహిళలతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి యజమానులుగా చేశామని, రెండేండ్లలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. త్వరలో మరో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వెయ్యి కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తుంటే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వెయ్యి బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నామని, మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిల్పారామంలో మహిళా సంఘాల స్టాల్స్ కోసం రూ. వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించినట్టు తెలిపారు.
ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పేటెంట్..
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అన్నారని, ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ పథకానికి పేటెంట్ కాంగ్రెస్దేనని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం నెలకు దాదాపు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి వల్ల వరి సాగు తగ్గించాలని రైతులకు సూచించారు. 7 రకాల సన్న వడ్లకు మంచి డిమాండ్ ఉన్నదని, వాటికి బోనస్ ఇస్తామన్నారు. ఈ ఏడాది ఎల్నినో వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, అందుకు తగ్గట్టు పంటలు సాగు చేయాలని సూచించారు.
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగయ్..
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నాడని, రాష్ట్రంలో వాళ్ల ఆటలు సాగబోవని రేవంత్ అన్నారు. ‘‘ఏంది మీ ప్రభుత్వం వచ్చేది? పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నారు.. వేశారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవు. అక్కడ గెలిచేందుకు బీజేపీకి 15 ఏండ్లు పట్టింది. తెలంగాణలోనూ ఆ పార్టీ గెలవాలంటే మరో 15 ఏండ్లు పడుతుంది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘నేను ఉన్నది ఉన్నట్లు చెప్తా. కాకపోతే కాదని చెప్తా. పదవి ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరమ్మ, వైఎస్, ఎన్టీఆర్కు ఎవరికీ పదవి శాశ్వతం కాదు. నాకు కూడా శాశ్వతం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. మేం అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపం. ఇచ్చిన మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరుకోసమే ఈ ప్రయత్నమంత’’ అని స్పష్టం చేశారు.
