
- పది రోజుల క్రితం నర్సింహా రెడ్డి బదిలీ
- ఇంకా కొత్త వారిని నియమించని సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కీలకమైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. పది రోజుల క్రితమే డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి ఇండస్ట్రీ ఇన్వెస్ట్ మెంట్ సెల్ అడిషనల్ సీఈఓగా బదిలీ అయ్యారు. అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాధ్యతలను మాత్రం ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదు. ఈ శాఖను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనకు ఇన్చార్జిగా ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. రాష్ట్రంలో 40వేలకు పైగా స్కూళ్లు, నాలుగు లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్న పెద్ద డిపార్ట్ మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. త్వరలోనే స్కూళ్లు ప్రారంభం కానుండగా.. ఈ సమయంలో విధానపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ డిపార్ట్మెంట్కు కీలకాధికారి అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారిందని టీచర్ల సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం ఆ బాధ్యతలను ఎవరికీ కేటాయించకపోవడంతో నర్సింహా రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇంకా అధికారికంగా రిలీవ్ కాలేదు. కనీసం కొత్తవారిని కేటాయించే దాకా ఆయన్ను అయినా ఇన్చార్జిగా కంటిన్యూ చేయలేదు. దీంతో ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కు రావడం లేదు. దీంతో పలు సమస్యల పరిష్కారం కోసం వస్తున్న టీచర్లకు, కిందిస్థాయి అధికారులకు నిరాశే ఎదురవుతోంది. డైరెక్టర్ లేకపోవడంతో కీలకమైన ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్టు ఓ అధికారి తెలి పారు. కాగా, ఉన్నతాధికారుల ఒత్తిడితో ఇటీవల జరి గిన డీఈఓల సమావేశంలో మాత్రం నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న కీలకమైన శాఖకు ఐఏఎస్ ఆఫీసర్ లేకపోవడంపై టీచర్ల సంఘాలు, విద్యావేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.