రూ.100 దాచుకున్న అల్లు అర్జున్.. కారణం చెప్పిన దర్శకేంద్రుడు

రూ.100 దాచుకున్న అల్లు అర్జున్.. కారణం చెప్పిన దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) గురించి ఇండియన్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కెరియర్ లో వందకు పైగా సినిమలను తెరకెక్కించిన ఆయన.. ఎన్నో గొప్ప గొప్ప విజయాలను ప్రేక్షకులకు అందించారు. అంతేకాదు.. ఆయన దర్శకత్వంలో మంది స్టార్ హీరోలను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేశ్, రాజకుమారుడు సినిమాతో మహేశ్ బాబు, గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ను హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. 

ఇదిలా ఉంటే, తాజాగా రాఘవేంద్రరావు ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సుదీర్ఘమైన తన సినీ అనుభవాలతో పాటు, చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో నాగేశ్వరరావు గారి డాన్సులను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేసేవారు. కానీ, చిరంజీవి డాన్సులకు మాత్రం పిల్లలు కూడా డాన్స్ చేసేవారు. వేరే ఏ హీరోకి అలా చేయడం నేను చూడలేదు. ఒకసారి నేను చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ వాళ్ల ఫ్యామిలీలో చిన్న చిన్న పిల్లలంతా డాన్సులు చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. అతని డాన్స్ చూసి నాకు ముచ్చటేసింది. వీడు పెద్దయ్యాక పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పి 100 రూపాయలు అతని చేతిలో పెట్టాను. అలా డబ్బులు ఇచ్చిన విషయం నేను మరిచిపోయాను కానీ, బన్నీ మాత్రం మర్చిపోలేదు. ఇటీవల ఒక సందర్భంలో బన్నీ వాళ్ల అమ్మగారు ఆ విషయం గుర్తు చేశారు. ఆ 100 రూపాయలను బన్నీ అలాగే దాచుకున్నాడట.. అది విని నాకు చాలా సంతోషం వేసింది అంటూ చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.

ఇక రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. రాఘవేంద్ర రావు నిర్మాత వ్యవహరించిన సర్కారు నౌకరి సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2లో హీరోగా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. 2024 ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.