
మెదక్, వెలుగు: చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ) మెదక్ డయసిస్ లో వర్గపోరు బయటపడింది. చర్చిలో పాస్టరేట్ కమిటీ ఎన్నికలు, పాలకవర్గ పదవుల నియామకం విషయంలో బిషప్ వర్గానికి, మరో వర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బిషప్ పై హత్యయత్నం జరగడం, ప్రత్యర్థి వర్గానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు కావడం చర్చిలో చర్చనీయాంశమైంది. గొడవల కారణంగా చర్చి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎస్ఐ పరిధిలో..
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్యాథడ్రల్చర్చి కొలువై ఉన్న మెదక్ పట్టణం సీఎస్ఐకి కేంద్ర స్థానం. సీఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో పలు చర్చిలతోపాటు, స్కూల్లు, కాలేజీలు, హాస్టల్లు, డేకేర్ సెంటర్లు, స్వయం ఉపాధి కల్పన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటికి ఆయా ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన స్థలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డయాసిస్ బిషప్ గా రెవరెండ్ సాల్మన్ రాజ్ ఉన్నారు. చర్చి నిర్వహణ, ఫెస్టివల్స్ ఆర్గనైజింగ్, సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవంతోపాటు స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యత పాస్టరేట్ కమిటీకి ఉంటుంది. సీఎస్ఐ బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించి పాస్టరేట్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఎన్నికలతో వివాదం...
గత నెల 1న పాస్టరేట్ కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో ఆఫీస్ బేరర్స్ ఎంపిక వివాదాస్పదంగా మారింది. సీఎస్ఐ రూల్స్ప్రకారం ఎక్కువ మంది సభ్యులు గెలిచిన వారితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తక్కువ మంది సభ్యులు ఎన్నికైన వారికి కమిటీలో చోటు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో గంట సంపత్ ప్యానెల్ నుంచి 11 మంది, రోలాండ్ పాల్ ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. రూల్స్ప్రకారం మెజారిటీ సభ్యులు గెలుపొందిన వారికి పాలకవర్గంలో పదవులు దక్కాలి. అయితే బిషప్ తన విచక్షణాధికారాలతో పలువురు సభ్యులను నామినేట్ చేశారు. వారు రోలాండ్ పాల్ ప్యానెల్ను సపోర్టు చేయడంతో పాలకవర్గ పదవులన్నీ ఆ ప్యానెల్కే దక్కాయి. బిషప్ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన తన ప్యానెల్కు పదవులు దక్కకుండా చేశారని గంట సంపత్ వర్గం ఆరోపిస్తోంది. గత నెలలో సంపత్ వర్గం చర్చి వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
పాస్టరేట్ కమిటీ పాలకవర్గం విషయంలో బిషప్ సాల్మన్ రాజ్, ప్రెసిబిటరీ ఇన్చార్జి జార్జ్లు ఏకపక్షంగా వ్యవహరించి తమ ప్యానెల్కు అన్యాయం చేశారంటూ గంట సంపత్ ఆధ్వర్యంలో వారిద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ విషయంపై చెన్నైలోని సినాడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాస్టరేట్ కమిటీ ఎన్నికల తీరుపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సంపత్వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం చర్చి వద్ద బిషప్ సాల్మన్రాజ్పై హత్యాయత్నం జరగడంతో వివాదం కొత్తమలుపు తిరిగింది. హత్యాయత్నం చేసిన రాంచందర్, సంపత్, ప్రభాకర్, నోబెల్సన్, సుమిత్ రాజ్, సుజిత్ రాజ్ , రాజ్ కిరణ్ లను అరెస్టుచేసి రిమాండ్ కు పంపినట్టు మెదక్ టౌన్ సీఐ మధు తెలిపారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో చర్చిలో విభేదాలు ఏం మలుపు తీసుకుంటాయోనన్న చర్చ మొదలైంది.