హైదరాబాద్, వెలుగు: డిస్కంల అప్పులు తీర్చేందుకు కొత్తగా రూ.12,600 కోట్ల అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ కోవిడ్ -19 లో భాగంగా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పేరుకుపోయిన బాకాయిలు తీర్చేందుకు లోన్లు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఢిల్లీకి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ ఈ మేరకు లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు సీపీఎస్ఈ, జెన్కో, ట్రాన్స్కో, ఐపీసీ, ఆర్ఈ జెనరేటర్స్ బకాయిలు రూ.14,333 కోట్లు పేరుకుపోయాయి. వీటిలో ప్రభుత్వ విభాగాల నుంచే రూ.12,609 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ప్యాకేజీలో భాగంగా దీర్ఘకాలిక రుణాలు తీసుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కోరాయి. డిస్కంల అభ్యర్థనను పరిశీలించి రూ.12,600 కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం అప్పును పీఎఫ్సీ, ఆర్ఈసీల నుంచి 50 శాతం చొప్పున తీసుకోవాలని సూచించింది.
For More News..