ఇల్లెందు/టేకులపల్లి/ పర్వతగిరి/ కాశీబుగ్గ/ జనగామ అర్బన్/ భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇల్లెందు, టేకులపల్లి మండలం చల్లసముద్రం, బోడులలో మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అంకిత్ పరిశీలించి, ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుముందు తండాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద పరిశీలించి, సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగంతో మక్కల కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించారు. జనగామ కలెక్టరేట్లో మక్కల కొనుగోళ్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష జరిపారు. గన్ని బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా పరంగా తీసుకున్న చర్యల వివరాలను మార్క్ఫెడ్ డీఎంను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల పనితీరుపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పర్యవేక్షించాలన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో కలెక్టర్ చాహత్బాజ్పాయ్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. మాణిక్యపూర్లోని రైస్మిల్ను పరిశీలించారు. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు సెంటర్ను పరిశీలించారు.
