- మాట్లాడితే ఢిల్లీ.. ట్వీట్ పెడితే వేరే స్టేట్..
- ట్రాప్లో పడుతున్న ప్రతిపక్షాలు..
- వచ్చే ఎన్నికలకు ఇదే వ్యూహమా!
సెంటిమెంట్ పార్టీగా పేరున్న టీఆర్ఎస్.. మూడు నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నది. రాష్ట్రాన్ని వదిలేసి పక్క దిక్కులు చూస్తున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. వరుసగా ఆయన చేస్తున్న ట్వీట్లు, ఇస్తున్న స్పీచ్లన్నీ అదే తీరుగా సాగుతున్నాయి. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయ వేదికలపై అధికార పార్టీ చేస్తున్న ఈ హంగామాతో ప్రతిపక్షాలు ట్రాప్లో ఇరుక్కుపోతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం మొత్తం అటు ఢిల్లీ, లేదంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల చుట్టే చక్కర్లు కొడుతున్నది. కేటీఆర్ సెంట్రిక్గా కొనసాగుతున్న ఈ వ్యవహారం మొత్తం జనం దృష్టిని మళ్లించేందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆత్మాభిమానం గురించి మాట్లాడే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా.. సొంత రాష్ట్రం ఆకాంక్షలను పక్కనబెట్టి కేంద్రంపై దాడి చేయడానికి, పొరుగు రాష్ట్రాలను నిందించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు వాటి చుట్టే తిరుగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మొదలు ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్రెడ్డి.. కేటీఆర్ ట్వీట్లకు, స్పీచ్లకు కౌంటర్లు ఇస్తున్నారు. వడ్ల లొల్లి నుంచి మొదలైన ఈ డైవర్షన్.. మూడురోజుల కిందట పార్టీ ప్లీనరీ, రెండు రోజుల కిందట ‘ఏపీలో కరెంటు లేదు’ అనే కామెంట్లతో మరింత పీక్స్కు చేరింది. ఇప్పటిదాకా పక్క రాష్ట్రాలపై చేసిన ట్వీట్స్, కేంద్రంపై చేసిన దాడితో ఏం సాధించలేకపోయినా.. ప్రజల దృష్టి మళ్లించడంలో మాత్రం కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు.
ఢిల్లీలో వడ్ల లొల్లితో షురూ
వడ్ల కొనుగోళ్లపై ఇందిరాపార్క్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేసింది. ఎఫ్సీఐ ఏ రాష్ట్రంలోనూ నేరుగా వడ్లను కొనడం లేదు. అయినా తెలంగాణలో మాత్రం వడ్లనే ఎఫ్సీఐ కొనాలనే వాదనతో ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు దిగింది. గతంలో ఎన్నడూ లేని ఈ వాదనతో రాష్ట్రంలో వడ్లు తామే కొంటున్నట్లుగా ప్రచారం చేసుకునేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్ర సర్కారే వడ్ల పేరుతో లొల్లి చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గి వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రధాని టూర్పైనా విమర్శలు
ప్రధాని మోడీ తెలంగాణ టూర్కు కేసీఆర్ దూరంగా ఉండటం విమర్శలకు దారితీసింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు పీఎంవోపై కేటీఆర్ చేసిన ఆరోపణలు రివర్స్ అయ్యాయి. ఫిబ్రవరి 5న ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎంను రావొద్దని పీఎంవో నుంచి సీఎంవోకు ఆదేశాలు వచ్చాయని కేటీఆర్ ఇటీవల నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పీఎంవో వద్దని చెప్పడంతోనే కేసీఆర్ వెళ్లలేదని అన్నారు.
రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు
టీఆర్ఎస్ ఎంచుకున్న మాటల మళ్లింపు స్కెచ్తో.. రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ తగ్గిపోయింది. భారీగా కరెంటు చార్జీలు, లిక్కర్ రేట్లు, బస్ చార్జీలను పెంచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలివ్వలేని పరిస్థితి మూడు నెలలుగా కొనసాగుతున్నది. దాదాపు 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తామంటూ రెండేండ్లుగా ప్రభుత్వం ఊరిస్తూనే ఉంది. కృష్ణా నీళ్లపై ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోకపోగా.. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామనే ప్రచారం చేపట్టి.. పంటల సాగుపై ఆంక్షలు విధించింది. వడ్ల కొనుగోళ్లపై చేసిన రాజకీయంతో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 3 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. భూములు, ఇసుక దందాలతో నేరాలు, పట్ట పగలు హత్యలు పెరిగిపోయాయి.
కేసీఆర్ను రావొద్దని అవమానించిన వాళ్లే ప్రొటోకాల్ పాటించలేదని నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ కామెంట్లను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ట్విట్టర్లో తోసిపుచ్చారు. ఫిబ్రవరి 5న ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొనాల్సి ఉందని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని సీఎంవోనే సమాచారం ఇచ్చిందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రధాని హైదరాబాద్కు వెళ్తే ఆయనకు ఆహ్వానం పలుకకుండా కేసీఆరే అవమానించారని అన్నారు. ప్రధాని రెండు సార్లు హైదరాబాద్కు వెళ్తే కేసీఆర్ ఇలాగే చేశారని, ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ మండిపడ్డారు.
కర్నాటకపై ట్వీట్లు పెట్టి, కామెంట్లు చేసి..!
కర్నాటకపై కేటీఆర్ చేసిన కామెంట్స్కు ఆ రాష్ట్ర సర్కారు కౌంటర్లు ఇచ్చింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రోజూ కరెంట్ కట్ చేస్తున్నారని రవీశ్ నరేశ్ అనే పారిశ్రామికవేత్త ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. బ్యాగులు ప్యాక్ చేసుకొని హైదరాబాద్కు వచ్చేయాలని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని తెలిపారు. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చేసిన మరో ట్వీట్కు బదులిస్తూ.. కర్నాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్పై కర్ణాటక సీఎంతో పాటు నెటిజన్ల నుంచి కేటీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోకి వస్తున్న ఎఫ్డీఐల్లో 40 శాతం కర్నాటకలోకే వస్తున్నాయని, ఇన్ఫ్రాస్ట్రక్షర్ సరిగా లేకుంటే వందలాది స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్లు బెంగళూరులో ఎందుకున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కర్నాటక మంత్రి సుధాకర్ కూడా రియాక్ట్ అవుతూ.. అమెరికాలోని నగరాలు, సింగపూర్తో బెంగళూరు పోటీ పడుతోందన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై విమర్శలు చేసే క్రమంలో రాయచూర్ను కేటీఆర్ వివాదంలోకి లాగి విమర్శలు ఎదుర్కొన్నారు.
‘‘బండి సంజయ్ ఇక్కడ పాదయాత్ర చేయడం కాదు.. ఆయన యాత్ర చేస్తున్న గద్వాల పక్కనే ఉన్న రాయచూర్కు వెళ్లి పరిస్థితులు తెలుసుకొని రావాలి’’ అని కేటీఆర్ అన్నారు. అవసరమైతే తాను ఏసీ కార్లు పెట్టి పంపిస్తానని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ కోసం రాయచూర్ను తెలంగాణలో కలపాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యేనే డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. దీనిపై రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తీవ్రంగా స్పందించారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేయాలని తామెప్పుడూ కోరలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బదులిచ్చారు.
ఏపీని చులకన చేసుడు.. ఎన్నికల కోసమేనా..?
దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి పక్క రాష్ట్రాన్ని కేటీఆర్ చులకన చేసి మాట్లాడి ఆ రాష్ట్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న రాష్ట్రంలో కరెంట్ లేదని, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తనకు ఒక మిత్రుడు ఈ విషయం చెప్పాడని ఆయన అన్నారు. హైదరాబాద్కు తిరిగి వచ్చాకనే తనకు ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని ఆ మిత్రుడు చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ఏపీలో కరెంట్ లేదని ఎవ్వరో చెప్తే కేటీఆర్కు తెలిసిందని, తాను హైదరాబాద్ నుంచే వస్తున్నానని, అక్కడ కరెంట్ లేకపోతే జనరేటర్ వేసుకొని ఉండి వచ్చానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలోని 25 మంది కేబినెట్ మంత్రుల్లో 17 మంది బడుగులే ఉన్నారని, సామాజిక న్యాయంలో తమతో పోటీపడాలని కేటీఆర్కు ఏపీ మరో మంత్రి జోగి రమేశ్ కామెంట్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఏపీ ఇంకో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.
కేంద్రం టార్గెట్గా ప్లీనరీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తే ప్రభుత్వ విజయాలు చెప్పుకోవడం పరిపాటి. ఏప్రిల్ 27న నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ కేంద్రమే టార్గెట్గా కొనసాగింది. ప్లీనరీలో 13 తీర్మానాలు చేస్తూ మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా చేసినవే. పార్టీ చీఫ్ కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్రావు సహా ఎమ్మెల్యేల వరకు కేంద్రంపైనే విమర్శలు చేశారు. మన సర్కారు చేసింది చెప్పుకోకుండా కేంద్రంపై కామెంట్స్ చేసి బీజేపీకే ప్రయారిటీ ఇస్తున్నారనే వాదన టీఆర్ఎస్ శ్రేణుల నుంచే వినిపిం చింది. ప్లీనరీ ప్రారంభం నుంచి ఇదే తీరు కొనసాగ డంతో లంచ్ తర్వాత ఎక్కువ మంది లీడర్లు మళ్లీ సభ ప్రాంగణంలోకే రాలేదు. టీఆర్ఎస్ తీర్మానాలు, స్పీచులపైనా సోషల్ మీడియాలో పంచులు పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు