అసత్య ప్రచారాలతోనే కాంగ్రెస్​ నెగ్గింది : డీకే అరుణ

అసత్య ప్రచారాలతోనే కాంగ్రెస్​ నెగ్గింది : డీకే అరుణ

పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్​అవినీతిపై పోరాటం, ఉద్యమాలు చేసింది కేవలం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. శుక్రవారం మహబూబ్​నగర్ లోని పార్టీ ఆఫీసులో అరుణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్​ఎన్నికల ప్రిపరేషన్ లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 28న నిర్వహిస్తున్న క్లస్టర్ మీటింగ్​కు వస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్​నాయకులు బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తమవైపు తిప్పుకున్నారని, అతికష్టం మీద నెగ్గారని విమర్శించారు. ఆ మాత్రం దానికే దేశాన్ని గెలిచినంత ఉప్పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమేనని, లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 10 నుంచి12 స్థానాలు కైవసం చేసుకుంటుందని అరుణ ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలు బీజేపీవేనని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మోదీ మూడోసారి ప్రధాని అవతారని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, శ్రీవర్ధన్​రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బంటు రమేశ్, అందె బాబయ్య తదితరులు పాల్గొన్నారు.