- ఆదాయం రూ.10,337 కోట్లు
- పూర్తి ఆర్థిక సంవత్సర లాభం రూ.2,379 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లు నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్కు 2023 మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో లాభం 8.3 శాతం పెరిగి రూ.505.21 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.466.35 కోట్ల లాభం వచ్చింది. డీమార్ట్ చైన్ను నడుపుతున్న రాధాకిషన్ దమానీ యాజమాన్యంలోని ఈ సంస్థకు కార్యకలాపాల ద్వారా రాబడి 21.11 శాతం పెరిగి రూ.10,337.12 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.8,606.09 కోట్ల ఆదాయం వచ్చింది. మార్జిన్లు ఏడాది ప్రాతిపదికన 8.6 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గాయి.
అయితే ఇబిటా 5.5 శాతం పెరిగి రూ.783 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్లో డీమార్ట్ 18 కొత్త స్టోర్లను ప్రారంభించడం ద్వారా తన రిటైల్ చైన్ను విస్తరించింది. 2023, మార్చి 31 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 324కి చేరుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ తన నెట్వర్క్కు మొత్తం 40 స్టోర్లను చేర్చింది. పూర్తి సంవత్సరానికి చూస్తే ఆదాయం 38 శాతం పెరిగి రూ.30,976 కోట్ల నుంచి రూ.42,840 కోట్లకు చేరుకుంది. మార్చి 2023తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.2,379 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం2022లో వచ్చిన రూ.1,493 కోట్లతో పోలిస్తే 59 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే శుక్రవారం, బీఎస్ఈలో కంపెనీ స్క్రిప్ 0.62 శాతం తగ్గి రూ.3680.25 వద్ద ముగిసింది.
