కార్వీ లాంటి స్కామ్​కి ఛాన్సే ఇవ్వం: సెబీ చెయిర్​ పర్సన్​

కార్వీ లాంటి స్కామ్​కి ఛాన్సే ఇవ్వం: సెబీ చెయిర్​ పర్సన్​

ముంబై: కార్వీ లాంటి స్కామ్​ మరోసారి జరిగే ఛాన్సే ఇవ్వమని సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్చేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా (సెబీ) చెయిర్​పర్సన్​ మాధబి పురి బుచ్​ వెల్లడించారు. స్టాక్​ బ్రోకర్లు మోసాలకు పాల్పడకుండా అవసరమైన అన్ని రెగ్యులేటరీ చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. సెబీ బోర్డు మీటింగ్​ తర్వాత  బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఇన్​సైడర్​ ట్రేడింగ్​, ఫ్రంట్​రన్నింగ్​వంటి అంశాలలో కఠినంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్​ ఉదంతంపై మీడియా అడిగిన ప్రశ్నలకు, ఈ అంశం కోర్టులో ఉందని తానేమీ కామెంట్​ చేయలేనని బదులిచ్చారు. షేర్​ ధరను ప్రభావితం చేసే సమాచారం ఏదైనా రూమర్ల రూపంలో బయటకు వచ్చినప్పుడు సంబంధిత కంపెనీ తప్పనిసరిగా ఆ రూమర్​ నిజమా, కాదా అనే విషయాన్ని స్పష్టం చేసేలా రూల్స్​ తెచ్చినట్లు సెబీ చీఫ్​ వెల్లడించారు. 


రూమర్​...కరెక్టో, కాదో 
వెంటనే చెప్పాల్సిందే...


అక్టోబర్​ 1, 2023 నుంచి మొదలయ్యే మొదటి దశలో దేశంలోని టాప్​100 కంపెనీలు ఈ కొత్త రూల్స్​ పాటించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఏప్రిల్​ 1, 2024 నుంచి 
టాప్​ 250 కంపెనీలకు రూల్స్​ వర్తింప చేస్తామని పేర్కొన్నారు. షేర్ల ధరలపై ప్రభావం చూపే అంశాలేమిటో అర్ధమయ్యేలా బెంచ్​మార్క్స్​తేనున్నట్లు మాధబి పురి బుచ్​ తెలిపారు. డైరెక్టర్ల బోర్డు మీటింగ్​ ముగిసిన 30 నిమిషాలలోపే సంబంధిత సమాచారాన్ని ఎక్స్చేంజీలకు తప్పనిసరిగా కంపెనీలు ఇవ్వాల్సిందేనని కూడా చెప్పారు. 


కార్పొరేట్​ డెట్​ మార్కెట్​ కోసం 
బ్యాక్​స్టాప్​ ఫండ్​....


లిక్విడిటీ ఎక్కువగా లేని ఇన్వెస్ట్​మెంట్​ గ్రేడ్​ డెట్​పేపర్లను కొనడం కోసం బ్యాక్​స్టాప్​ ఫండ్​ ఏర్పాటు ప్రపోజల్​ను కూడా  సెబీ బోర్డు ఆమోదించింది. ఫైనాన్స్​మినిస్టర్​ కిందటేడాది బడ్జెట్లో ఈ బ్యాక్​స్టాప్​ ఫండ్​ ప్రపోజల్​ను ముందుకు తెచ్చారు.

సెకండరీ మార్కెట్​కూ ఏఎస్​బీఏ ....


ఐపీఓలలో సబ్​స్క్రిప్షన్​ కోసం అమలులో ఉన్న అప్లికేషన్​ సపోర్టెడ్​ బై బ్లాక్డ్​ అమౌంట్​ (ఏఎస్​బీఏ) తరహాలో సెకండరీ మార్కెట్​ కోసం ఒక కొత్త పద్ధతిని తేనున్నట్లు సెబీ చీఫ్​ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పద్ధతి బ్రోకర్లకు, ఇన్వెస్టర్లకు ఆప్షనల్​ మాత్రమేనని పేర్కొన్నారు. ఐపీఓలో షేర్లకు దరఖాస్తు చేసుకున్నా, ఫండ్స్​ మాత్రం ఇన్వెస్టర్​ సేవింగ్స్​ అకౌంట్లోనే బ్లాక్​ చేసి ఉంటాయి. అంటే, అప్పుడు కూడా ఇన్వెస్టర్​కు వడ్డీ ఆదాయం దొరుకుతుందన్న మాట. రిటెయిల్​ ఇన్వెస్టర్ల డబ్బుకు  సేఫ్టీ పెంచాలనే  ఈ పద్ధతి తెస్తున్నట్లు సెబీ చీఫ్​ వివరించారు.