- లాన్సెట్ ఇండియా టాస్క్ఫోర్స్ సూచన
- ముప్పును బట్టి 3 జోన్లు చేయాలె
- లో, మీడియం రిస్క్, హాట్స్పాట్లను పెట్టాలె
- హాట్స్పాట్లోనే ఆంక్షలు పెట్టాలె
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి టార్గెటెడ్ చర్యలు చేపట్టాలే తప్ప పూర్తి లాక్డౌన్ పెట్టనే వద్దని లాన్సెట్ ఇండియా టాస్క్ఫోర్స్ సూచించింది. లాక్డౌన్పై చర్చలను పక్కనపెట్టి రోజువారీ సగటు కేసులు, కేసుల పెరుగుదల రేటు, చేస్తున్న టెస్టులు, పాజిటివిటీ రేటు, ఐసీయూ బెడ్ల వాడకం వంటి వివరాల ఆధారంగా కరోనా కట్టడి వ్యూహాలను రూపొందించాలని చెప్పింది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. లాక్డౌన్ పెట్టాలనుకుంటే మాత్రం ఆర్థికంగా దెబ్బపడే వర్గాల కోసం ఉపశమన చర్యలను ముందే చేపట్టాలని తేల్చి చెప్పింది. పది మంది కన్నా ఎక్కువ గుమి గూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
స్థానిక పరిస్థితులను బట్టే..
తప్పనిసరైతే మాత్రమే స్థానిక పరిస్థితులకు తగ్గట్టు టార్గెటెడ్ లాక్డౌన్ను పెట్టాలని లాన్సెట్ టాస్క్ఫోర్స్ సూచించింది. కేసులు, మరణాలు, వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్డౌన్ పెట్టాలంది. లాక్డౌన్కు బదులు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను లో, మీడియం రిస్క్జోన్లు, హాట్స్పాట్లుగా విభజించి చర్యలు చేపట్టాలని సూచించింది.
లో రిస్క్జోన్లో ఇలా..
కొత్త కేసులు 2% కన్నా తక్కువగా నమోదై.. ఐసీయూ బెడ్లు 80% కన్నా ఎక్కువగా అందుబాటులో ఉండే ప్రాంతాలను తక్కువ ముప్పున్న జోన్లుగా గుర్తించాలని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, షాపులు, రెస్టారెంట్లు, ఆఫీసులు, గుళ్లుగోపురాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలను 50% కెపాసిటీతో తెరుచుకునేందుకు అనుమతించాలని సూచించింది. అయితే, కేసులు మరిన్ని పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాక్సినేషన్ను వేగంగా కొనసాగించాలని పేర్కొంది.
మీడియం రిస్క్ జోన్ ఇట్లా..
చేసిన టెస్టుల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10% మధ్య ఉండి కొత్త కేసుల్లో 2 నుంచి 5% వరకు పెరుగుదల నమోదవుతూ.. 40 నుంచి 80% వరకు ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉండే ప్రాంతాలను మీడియం రిస్క్ జోన్గా గుర్తించాలని టాస్క్ఫోర్స్ సూచించింది. ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటూ జనాలు బయట తిరిగేలా చూడాలంది.
హాట్స్పాట్స్లో ఆంక్షలు మస్ట్
పాజిటివిటీ రేట్ 10% కన్నా ఎక్కువగా ఉండి 40% కన్నా తక్కువ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించాలని టాస్క్ఫోర్స్ సూచించింది. ఇలాంటి ప్రాంతాల్లో తప్పకుండా ఆంక్షలు విధించాల్సిందేనని, కొన్ని మినహాయింపులు ఇవ్వాలని చెప్పింది. ముప్పు తీవ్రత మీడియం కేటగిరీకి వచ్చే దాకా స్కూళ్లు, కాలేజీలను మూసే యాలంది. షాపులు, రెస్టారెంట్లు, ఆఫీసులు, గుళ్లు, ప్రార్థనామందిరాలు, ఫ్యాక్టరీలను 6 నుంచి 10 వారాలు బంద్ పెట్టాలని తేల్చి చెప్పింది. ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతులివ్వాలని సూచించింది.
జీనోమ్ సీక్వెన్స్ను పెంచాలె
ప్రస్తుతం చేస్తున్న కరోనా టెస్టుల్లో కనీసం 5% నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని లాన్సెట్ టాస్క్ఫోర్స్ సూచించింది. వివిధ వేరియంట్లతో ఉన్న ముప్పు గురిం చి జిల్లాలకు సమాచారం అందించాలని చెప్పింది. దేశంలో ప్రయాణాలపై ఆంక్ష లు విధించొద్దని సూచించింది. బస్సులు, రైళ్లను ఆపేయొద్దని పేర్కొంది.