
- బ్యాగ్స్తోనే కలెక్టరేట్కు స్టూడెంట్లు
జగిత్యాల, వెలుగు : ఫీజు బకాయి ఉందన్న కారణంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్కు చెందిన పలువురు స్టూడెంట్లను క్లాస్లకు అనుమతించకపోవడంతో వారు లంచ్బాక్స్, స్కూల్బ్యాగ్స్తో కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన స్టూడెంట్లు శ్రీచైతన్య, అక్షర, వాగ్ధేవి, చుక్క రామయ్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుతున్నారు.
వీరికి సంబంధించిన ఫీజులు బకాయి ఉండడంతో ఆయా స్కూళ్లు సోమవారం 14 మంది స్టూడెంట్లను క్లాస్లకు అనుమతించలేదు. దీంతో స్టూడెంట్లు యూనిఫాంలోనే బ్యాగ్లు పట్టుకొని కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని డీఈవో రాము దృష్టికి తీసుకెళ్లడంతో అది తమ పరిధిలోని అంశం కాదని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్టూడెంట్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
అయినా ఆఫీసర్లు స్పందించకపోవడంతో జగిత్యాల – కరీంనగర్ హైవేపై రాస్తారోకో చేశారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎంపికైన స్టూడెంట్లను వేరే బ్రాంచ్లకు తరలించి, క్లాస్ నుంచి వేరుగా కూర్చోబెట్టి అవమానిస్తున్నారని పలువురు స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ అక్కడికివచ్చి జిల్లా ఆఫీసర్లను కలిసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.