అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు కష్టకాలం మొదలైంది. 2020లో జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫ్లోరిడాలోని ట్రంప్ ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఎఫ్బీఐ ఏజెంట్లు పెద్ద ఎత్తున చేరుకొని ట్రంప్ ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై ఎఫ్బీఐ అధికారులు ఎలాంటి సమాచారాన్ని బయటికి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వారి ప్రకటన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే ట్రంప్ ఇంటి నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఎఫ్బీఐ తనిఖీలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మార్-ఎ-లెగోలోని పామ్ బీచ్లోని తన నివాసంపై దాడులు చేసిన ఎఫ్బీఐ... స్వాధీనం చేసుకుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు కారణాలను మాత్రం తెలుపలేదన్నారు. ఎఫ్బీఐ చర్య రాజకీయ ప్రతీకారమేనన్న ట్రంప్.... మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు గడ్డు కాలమన్నారు. పెద్ద సంఖ్యలో ఎఫ్బీఐ ఏజెంట్లు చుట్టుముట్టారని.. ఇది దేశానికి చీకటి సమయం అంటూ ట్రంప్ ఆరోపించారు.
దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన నివాసంపై దాడి చేశారని ట్రంప్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే డెమొక్రాట్ల దాడేనంటూ ట్రంప్ విమర్శించారు. కాగా.. ఎఫ్బీఐ దాడుల సమయంలో ట్రంప్ ఇంట్లో లేరని.. ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉన్నట్లు సమాచారం.