అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలులో సహకరించకపోతే భారత్ నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయం ప్రధాని మోదీకి బాగా తెలుసన్నారు. మోదీ మంచి వ్యక్తి అంటూనే తనను సంతోషపెట్టడం భారత్ కు చాలా ముఖ్యమని వ్యాఖ్యలు చేశారు ట్రంప్ . ఇండియాపై ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ ఏమన్నారంటే .. ప్రధానమంత్రి మోడీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వాళ్లకు ముఖ్యం. వారు మనతో వ్యాపారం చేస్తారు ,మనం వాటిపై సుంకాలను స్పీడ్ గా పెంచుతాం అన్న ఆడియోను వైట్ హౌస్ తన ఎక్స్ లో షేర్ చేసింది.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని మోడీ తనకు మాటిచ్చారని ట్రంప్ చాలా సార్టు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశ పౌరుల అవసరాలకే భారత్ తొలి ప్రాధ్యానత ఇస్తుందని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. మూడేళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాతో వాణిజ్యం చేయొద్దని ప్రపంచ దేశాలను ట్రంప్ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ మాత్రం దేశ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. తన మాట ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో ఇండియా ఎగుమతులపై ట్రంప్ అదనపు సుంకాలు విధించాడు. అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలును ఇండియా ఆపలేదు. ఈ నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
