హైదరాబాద్, వెలుగు: అంతరాయాలు లేకుండా కరెంటును సరఫరా చేస్తున్నా కొందరు పని గట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తూ తమ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఫైర్ అయింది. సోమవారం మింట్ కాంపౌండ్లో స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవర్ జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన కరెంటును సరఫరా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు.
తమకు సంబంధం లేని ఇంటర్నల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడినా దాన్ని తమ తప్పిదంగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలతో విద్యుత్ సిబ్బంది, అధికారుల మనోధైర్యం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో అంచనాలకు మించి డిమాండ్ వస్తున్నా తమ సిబ్బంది, ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండి కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ జి సాయి బాబు, కన్వీనర్ పి. రత్నాకర్ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు.