
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కార్నర్ మీటింగ్ తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనేక మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే మృతుల కుటుంబ సభ్యులు విజయ్ నష్టపరిహారాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట చనిపోయిన 22ఏళ్ల ఓ మహిళ కుటుంబ సభ్యులు విజయ్ ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను తిరస్కరించినట్లు తెలుస్తోంది.. మాకు కావాల్సింది డబ్బు కాదు.. మా చెల్లిని తెచ్చి ఇవ్వండి అంటూ మృతురాలి అక్క చెప్పడం సంచలనంగా మారింది.
నా సోద రి తన బిడ్డను నాదగ్గర వదిలి ర్యాలీకి వెళ్లింది. శనివారం సాయంత్రం 4గంటల సమయంలో ఫోన్ చేశాం.. రెస్పాన్స్ రాలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం అయినా స్పందన లేదు.. రాత్రి 10 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె ఫొటోలను నిర్వాహకులకు పంపించగా అప్పటికే తొక్కిసలాటలో చనిపోయిందని చెప్పారు. అని బోరున విలపించింది మృతురాలి అక్క.
తొక్కిసలాటలో తన అభిమానుల మృతిపట్ల విజయ్ సంతాపం తెలిపారు. ఈ ఘటనతో తాను దుఖంలో మునిగిపోయానని, చాలా బాధగా ఉందని ప్రకటించారు. తొక్కిసలాటలో చనిపోయివారికి ఒక్కొక్కరికి 20 లక్షలు, గాయపడినవారికి రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించారు.
తొక్కిసలాటకు పార్టీ నిర్వాహకులు, విజయ్ లేటు రావడమే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన విజయ్.. ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది అధికార పార్టీ డీఎంకే కుట్ర అని అన్నారు. ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ జాప్యం జరిగిందని టీవీకే చీఫ్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని లేదా సీబీఐకి అప్పగించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది టీవీకే పార్టీ.