
అమెరికాకు ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తి
అమెరికాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్లు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను పట్టించుకోవాలని అమెరికాకు వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ, వివిధ రాష్ట్రాల్లోని ఇండియన్ కాన్సులేట్లు విజ్ఞప్తి చేశాయి. ‘‘అమెరికాలో ప్రస్తుతం 2 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్లు సైన్స్, మెడికల్, టెక్నాలజీ వంటి విభాగాల్లోని కోర్సుల్లో చదువుతున్నారు. దాదాపు 300 టాప్ యూనివర్సిటీలు, అనేక కాలేజీలు మూతపడ్డాయి. హాస్టళ్లను సైతం బంద్ పెట్టి, ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. స్టూడెంట్లను హాస్టళ్ల నుంచి సైతం పంపేస్తున్నారు. మరోవైపు వీసా ఇబ్బందులు, అటు అమెరికా, ఇటు ఇండియా కూడా ప్రయాణాలపై ఆంక్షలు పెట్టినందున స్టూడెంట్స్ మా దేశానికి వచ్చేందుకూ వీలు కావడం లేదు. వీసా రూల్స్ ప్రకారం, నేరుగా జరిగే క్లాసెస్ కు హాజరయ్యేందుకే మా స్టూడెంట్లకు అనుమతి ఉంది. ఆన్ లైన్ క్లాసెస్ కు కూడా వారిని అనుమతించండి” అని వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీతో పాటు హూస్టన్, అట్లాంటా, షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్లు అమెరికా విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశాయి.
ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. కరోనా విపత్తు వల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్లకు కలుగుతున్న ఇబ్బందులు, వారి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. స్టూడెంట్ అండ్ ఎక్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కొనసాగుతుందని, స్టూడెంట్ల వీసా స్టేటస్ పై ప్రభావం పడకుండానే, అమెరికా నుంచి లేదా ఇతర దేశాల నుంచి అయినా సరే ఆన్ లైన్ క్లాసెస్ కు అనుమతిస్తామని చెప్పినట్లు ఈ మేరకు ఇండియన్ ఎంబసీ వివరించింది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కూడా ఓ నోట్ విడుదల చేసింది. కాలేజీలు మూతపడటం వల్ల ఆన్ లైన్ క్లాసెస్ లేదా ఇతర ప్రత్యామ్నాయ విధానాల్లో కోర్సును కంటిన్యూ చేసే స్టూడెంట్లకు ‘స్టూడెంట్ అండ్ ఎక్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎస్ఈవీఐఎస్)లో వారి వీసా స్టేటస్ యాక్టివ్ గానే ఉంటుందని స్పష్టం చేసింది. కాలేజీలు, స్కూళ్లకు తాత్కాలిక సెలవుల మాదిరిగానే ప్రస్తుత పరిస్థితిని అనుకోవాలని పేర్కొంది.
బయటి దేశాల్లో మనోళ్ల తిప్పలు
ట్రావెలింగ్పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో విదేశాల్లోని మన సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాలు క్వారంటైన్లో ఉండి కరోనా నెగెటివ్ వచ్చాకే అనుమతిస్తామని కేంద్రం చెప్పడంతో సింగపూర్, బాలి, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, బ్రిటన్ ఎయిర్పోర్టుల్లో అవస్థ పడుతున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి సింగపూర్లోని చాంగీ ఎయిర్పోర్టులో చిక్కుకున్న 100 మంది ఇండియన్లు సొంత దేశం రాలేక ఇబ్బందిపడుతున్నారు. వాళ్లను ఇండియా తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్తో మాట్లాడుతున్నామని ఇండియన్ హై కమిషన్ వెల్లడించింది. ఎయిర్పోర్టులో చిక్కుకున్న మనోళ్లకు తిండి, ఇతర ఏర్పాట్లు చేశామంది. ఉజ్బెకిస్థాన్లో ఇండియన్లు 50 మంది చిక్కుకున్నారు. వీళ్లలో 39 మంది మహారాష్ట్ర వాళ్లు. మిగతా వాళ్లు గుజరాతీలు.
కౌలాలంపూర్లో 75 మంది
మలేసియాలోని కౌలాలంపూర్లోనూ 75 మంది ఇండియన్లు చిక్కుకుపోయారు. బాలీలో కూడా మనోళ్లు 25 మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.