హైదరాబాద్, వెలుగు: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ పూర్తయి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కాని భూముల విషయంలో కొత్త చిక్కు వచ్చిపడింది. మ్యుటేషన్ అప్లికేషన్ పెండింగ్ లో ఉన్న ఇలాంటి భూములపై ధరణి పోర్టల్లో పాత ఓనర్ల పేర్లే కనిపిస్తున్నాయి. గత ఒకటీ రెండేండ్లలో భూమిని వేరొకరికి అమ్మిన కొందరు వ్యక్తులు.. ఇదే అదునుగా మరొకరికి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మంచిర్యాల, ఖమ్మం జిల్లాలో వెలుగు చూశాయి. దీంతో మ్యుటేషన్ పెండింగ్లో ఉన్నవాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. తమకు భూమి అమ్మిన వ్యక్తుల పేర్లే ధరణిలో వచ్చాయని, వాళ్లు తమకు తెలియకుండా స్లాట్బుక్ చేసుకుని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏండ్లుగా మ్యుటేషన్ల కోసం పెండింగ్
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయ్యాక మీ–సేవ ద్వారా అప్లై చేసుకుంటే రూల్స్ ప్రకారం 15 రోజుల్లో కొనుగోలుదారుడి పేరిట తహసీల్దార్ మ్యుటేషన్ పూర్తి చేయాలి. మ్యుటేషన్ అప్లికేషన్ రాగానే రెవెన్యూ సిబ్బంది గ్రౌండ్లెవెల్లో పరిశీలించి ఆ అప్లికేషన్ కు అప్రూవల్ ఇవ్వడమో.. రిజెక్ట్ చేయడమో చేయాలి.ఏండ్ల తరబడి పెండింగ్ లో పడుతున్నాయి. ఇలా భూముల రిజిస్ట్రేషన్ తర్వాత చేయాల్సిన మ్యుటేషన్లతోపాటు పట్టాదారు చనిపోతే ఆ వ్యక్తి వారసుల పేరిట చేయాల్సిన విరాసత్ అప్లికేషన్లు కలిపి ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో 1,16,476 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో మీ–సేవ కేంద్రాల ద్వారా వచ్చిన మ్యుటేషన్ అప్లికేషన్లు 88,323, విరాసత్ అప్లికేషన్లు 14,576 ఉండగా, బ్యాక్ లాగ్ మ్యుటేషన్ అప్లికేషన్లు 5,766, బ్యాక్ లాగ్ విరాసత్ అప్లికేషన్లు 7,811 ఉన్నాయి. దీంతో ఈ భూములకు యజమానులుగా ధరణి పోర్టల్లో పాత ఓనర్ల పేర్లే వస్తున్నాయి. ఏడాది, రెండేండ్ల కింద భూమి అమ్ముకున్న సదరు వ్యక్తులు ఇప్పుడు ధర పెరిగిందనే ఆశతో మోసపూరితంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
అప్పటిదాకా ‘ధరణి’ని ఆపాలి
మా నాన్న వికారాబాద్ జిల్లా మరిపల్లి మండలం తుమ్మలపల్లిలో 2018లో పదెకరాలు, 2019లో మరో ఐదెకరాలు వేర్వేరు సర్వే నంబర్లలో భూమి కొన్నారు. మాకు అమ్మినవాళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. తర్వాత మ్యుటేషన్, పట్టాదారు పాస్బుక్ కోసం మీ –సేవ సెంటర్లో మూడుసార్లు అప్లికేషన్ పెట్టినా ఇప్పటివరకు మ్యుటేషన్ చేయలేదు. పాస్బుక్ ఇవ్వలేదు. ధరణిలో మాకు భూమి అమ్మినోళ్ల పేర్లే వచ్చాయి. వాళ్లు వేరొకరికి భూమి అమ్ముకుంటే పరిస్థితి ఏంది? అందుకే మ్యుటేషన్లు పూర్తయ్యే వరకు ధరణిని నిలిపివేయాలి.
– కె.దయాకర్ రెడ్డి, సంగారెడ్డి
ఐదు రోజుల్లో 4,525 రిజిస్ట్రేషన్లు
ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం వరకు 4,525 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ధరణి ఈ నెల రెండో తేదీన మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు 490, రెండున 523, మూడున 870, నాలుగున 1,170, ఐదో తేదీన 1,472 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకు ఈ పోర్టల్ను 63 వేల మంది సందర్శించారు. వీరిలో 38,132 మంది రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు10 కోట్ల77 లక్షల రూపాయలు వచ్చాయి. ధరణి పోర్టల్ ద్వారా మార్టిగేజ్ డీడ్స్, బ్యాంకు మాడ్యూల్స్, నాలా కన్వర్షన్ అప్లికేషన్ వంటి సేవలు కూడా త్వరలో అందుబాటులో వస్తాయని సీఎస్ వెల్లడించారు.