అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందంటున్నారు డాక్టర్లు. ఇదే విషయంపై ఆ దేశ ప్రముఖ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రానున్న రోజుల్లో రోజుకు లక్ష కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. అమెరికాలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడం కోసం తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రజలు, అధికారులు ఎవరికి వారే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే…. ప్రస్తుతం రోజుకు 40 వేల చొప్పున నమోదవుతున్న కేసులు ఇకపై లక్షలకు చేరినా ఆశ్చపోవాల్సిన అవసరం లేదని ఫౌసీ తేల్చి చెప్పారు.
కొత్త కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో కరోనా నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కట్టిడిలో వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా ఎవరికివారే బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప సమస్య పరిష్కారం ఉండదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి చేస్తే చాలా ప్రమాదకరమని అమెరికా ప్రజలను ఫౌసీ హెచ్చరించారు.