
- వార్షికంగా 10.6% పెరుగుదల
- రూ.7,214.8 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ. 1,378.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగింది. ఈ కాలంలో కంపెనీ క్వార్టర్లో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన ఈ ఫార్మా సంస్థ గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,237.90 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 6.6 శాతం వృద్ధితో రూ.7,214.8 కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ నుంచి భారీగా ఆదాయం వచ్చింది. కంపెనీ ఇబిటా 7.4 శాతం పెరిగి రూ.2210.7 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్ కూడా 29 శాతం నుంచి 29.3 శాతానికి పెరిగింది. ‘‘ఈ క్వార్టర్లోమేం అత్యధిక అమ్మకాలు సాధించాం. కొత్త ప్రొడక్టుల అమ్మకాలు బాగుండటం, యూఎస్మార్కెట్లో షేర్ పెరగడం, యూరప్ బిజినెస్ బలంగా ఉండటం వల్ల ఆదాయాలు బాగున్నాయి” అని కంపెనీ కో–-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ అన్నారు.
విదేశీ మార్కెట్ల పనితీరు ఇలా...
యూఎస్తో సహా ఉత్తర అమెరికా వ్యాపారం తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసి రూ.3350 కోట్లకు చేరుకుంది. కంపెనీ బేస్ బిజినెస్ వాల్యూమ్లలో నికర పెరుగుదల సీక్వెన్షియల్గా 5 శాతం ఉంది. భారతదేశంలో విక్రయాల విలువ రూ. 1180 కోట్లుగా ఉంది. ఇవి సీక్వెన్షియల్గా ఐదు శాతం పెరగగా, వార్షికంగా ఒక శాతం తగ్గాయి. రష్యా నుంచి వచ్చే ఆదాయం రూ. 590 కోట్లు ఉంది.
ఇది వార్షికంగా 14 శాతం తగ్గినా, సీక్వెన్షియల్గా 2 శాతం పెరిగింది. తాజా క్వార్టర్లో అమ్మకం, సాధారణ, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు సంవత్సరానికి 12 శాతం పెరిగి రూ. 2020 కోట్లుగా ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి ఖర్చులు రూ. 560 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఇవి 7.7 శాతం ఉన్నాయి. ఈ క్వార్టర్లో డాక్టర్ రెడ్డీస్ ప్రపంచవ్యాప్తంగా 38 డ్రగ్ మాస్టర్ ఫైల్స్ దాఖలు చేసింది. భారతదేశంలో 3 కొత్త బ్రాండ్లను ప్రారంభించింది. ఉత్తర అమెరికా ప్రాంతంలో 4 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది.