
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 22శాతం పెరిగి రూ.1,594 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,307 కోట్లు వచ్చాయి. హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీకి మార్చితో ముగిసిన క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా రూ.8,506 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.7,083 కోట్లతో పోలిస్తే 20శాతం ఎక్కువ. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ.8 తుది డివిడెండ్ను కంపెనీ సిఫార్సు చేసింది.
పన్ను తర్వాత లాభం (పీఏటీ) సీక్వెన్షియల్గా 13శాతం పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో పీఏటీ రూ.1,413 కోట్లుగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్లో స్థూల ఆదాయం రూ.8,359 కోట్లు ఉంది. గ్లోబల్ జెనరిక్స్ వ్యాపారంలో, ఉత్తర అమెరికా రూ. 3,559 కోట్ల ఆదాయాన్ని అందించింది. ఇది ఏడాది లెక్కన 9శాతం వృద్ధిని సాధించింది.
యూరోపియన్ వ్యాపార ఆదాయం 145శాతం పెరిగి రూ. 1,275 కోట్లకు చేరుకుంది. ఎన్ఆర్టీ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం ఇందులో కలిసి ఉంది. భారతదేశ వ్యాపార ఆదాయం నాలుగో క్వార్టర్లో రూ. 1,126 కోట్ల నుంచి ఏడాది లెక్కన 16శాతం పెరిగి రూ. 1,305 కోట్లకు చేరుకుంది. ఇబిటా రూ. 2,475 కోట్లుగా ఉంది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఆదాయం కూడా ఏడాది లెక్కన16శాతం వృద్ధితో రూ. 956 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 822 కోట్లు ఉందని డాక్టర్ రెడ్డీస్తెలిపింది.