హైదరాబాద్, వెలుగు : ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ నికర లాభం డిసెంబర్ 2022 క్వార్టర్లో 77 శాతం పెరిగి రూ. 1,247 కోట్లకు చేరింది. 2022 క్యూ 3 లో రెవెన్యూ కూడా 27 శాతం పెరిగి రూ. 6,770 కోట్లయింది. ఎనలిస్టుల అంచనాలకు మించిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ను డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. తాజా క్వార్టర్లో కంపెనీ రూ. 5,830 కోట్ల ఆదాయంపై రూ. 910 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని ఎనలిస్టులు ఇంతకు ముందు అంచనా వేశారు. తాజా క్యూ 3 లో గ్రాస్ మార్జిన్ 59.2 శాతానికి మెరుగుపడినట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరెజ్ ఇజ్రేలీ మీడియాకు చెప్పారు. నార్త్ అమెరికా, రష్యా మార్కెట్లలో గ్రోత్ వల్లే మంచి పెర్ఫార్మెన్స్ సాధించగలిగినట్లు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్టుల లాంఛ్, ఫారెక్స్ కదలికల వల్ల గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందని వివరించారు. గ్లోబల్ జెనరిక్స్, పీఎస్ఏఐ బిజినెస్ సెగ్మెంట్లలో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్లు వరసగా 64.6 శాతం, 18.2 శాతంగా ఉన్నాయని చెప్పారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ గ్లోబల్ జెనరిక్స్ సెగ్మెంట్ రెవెన్యూ కిందటిసారి క్యూ 3 తో పోలిస్తే 33 శాతం ఎక్కువై రూ. 5,920 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా చూసినా ఇది 6 శాతం పెరిగింది. నార్త్ అమెరికా మార్కెట్లో 64 శాతం గ్రోత్, యూరోప్ మార్కెట్లో 6 శాతం గ్రోత్, ఇండియా మార్కెట్లో 10 శాతం గ్రోత్, ఎమర్జింగ్ మార్కెట్లలో 14 శాతం గ్రోత్ సాధించినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇన్గ్రీడియెంట్స్ (పీఎస్ఏఐ) సెగ్మెంట్లో తాజా క్యూ 3 లో 7 శాతం గ్రోత్ కనబరిచినట్లు పేర్కొంది.
9 నెలల్లో.....
డిసెంబర్ 2022 దాకా 9 నెలలకు కలిపి చూస్తే డాక్టర్ రెడ్డీస్ రెవెన్యూ రూ. 18,291 కోట్లకు పెరగ్గా, నికర లాభం రూ. 3,548 కోట్లకు చేరింది. అంటే రెవెన్యూ 14 శాతం, నికర లాభం 56 శాతం పెరిగినట్లు.