న్యూఢిల్లీ: సెలవులో ఉన్నప్పుడు కూడా ఆఫీసు నుంచి కాల్స్ వస్తే ఉద్యోగులకు చిరాకు కలగడం సహజం. మెసేజ్లు, ఈ–మెయిల్స్ వచ్చినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్ 11 ఈ సమస్యను పరిష్కరించడానికి "డ్రీమ్ 11 అన్ప్లగ్" అనే ఆసక్తికరమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం కంపెనీ సిబ్బంది ఆఫీసు పని, సంబంధిత ఈ–మెయిల్స్, వాట్సాప్ మెసేజెలు లేదా కాల్స్కు ఒక వారం పాటు దూరంగా ఉండవచ్చని లింక్డ్ ఇన్ పోస్ట్ ద్వారా డ్రీమ్11 వెల్లడించింది.
సెలవులో ఉన్న ఉద్యోగులకు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని వెల్లడించింది. మనకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడిపితే మరింత సంతోషంగా ఉంటామని, మరింత బాగా పనిచేయగలుగుతామని పేర్కొంది. ఈ విషయమై డ్రీమ్ 11 ఫౌండర్ హర్ష్ జైన్ భవిత్ సేథ్ మాట్లాడుతూ, "అన్ప్లగ్"లో ఉన్న ఉద్యోగిని ఎవరైనా సహోద్యోగి సంప్రదిస్తే రూ. లక్ష జరిమానా చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ స్పోర్ట్స్ టెక్నాలజీ యునికార్న్లో పనిచేసే టాప్ బాస్ల నుండి మొదలుకొని కొత్త ఉద్యోగుల వరకు, ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక వారం పాటు ‘అన్ప్లగ్’ సదుపాయం పొందవచ్చు. 2008లో ఏర్పడ్డ డ్రీమ్ 11 కి ప్రస్తుతం 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2020 లో ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి టైటిల్ స్పాన్సర్గానూ మారింది.