బల్దియా బదిలీ చేసింది.. వాటర్ బోర్డు వదిలేసింది!

బల్దియా బదిలీ చేసింది.. వాటర్ బోర్డు వదిలేసింది!

“రామ్ నగర్‌‌కు చెందిన సంపత్​ప్రైవేట్​ఎంప్లాయ్. మంగళవారం బంజారాహిల్స్ లోని ఆఫీసుకు వెళ్తున్నాడు. అతడు బైక్​పై ఖైరతాబాద్ ​జంక్షన్ మీదుగా తాజ్​కృష్ణ వైపు వెళ్తున్నాడు. ఓ చోట  డ్రైనేజీ నీరంతా రోడ్డుపైనే పారుతుండగా కారు స్పీడ్ గా వెళ్లడంతో  మురుగునీరు సంపత్​పై పడింది. డ్యూటీకి వెళ్లకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయి డ్రెస్ చేంజ్​చేసుకొని మళ్లీ మధ్యాహ్నం వెళ్లాడు.  బల్దియా హెల్ప్​లైన్ నంబర్​కి కాల్​చేసి కంప్లయింట్​ చేశాడు.  ఇప్పుడు డ్రైనేజీలను చూడడం లేదని వాటర్​బోర్డుకు కంప్లయింట్ చేయాలని ఓ అధికారి సమాధానం ఇచ్చారు’’.  

హైదరాబాద్, వెలుగు: సిటీలో రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నయ్. మెయిన్​రోడ్లు, కాలనీలు, బస్తీలు అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. కిలోమీటర్ల మేర మురుగు పారుతుండడంతో పాటు కంపు వానస వస్తోంది. కార్లు, బైక్ లు స్పీడ్​గా వెళ్తుంటే  బైక్​పై, నడిచి వెళ్లే వారిపై పడుతోంది. సమస్యపై కంప్లయింట్​ చేస్తే అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు డ్రైనేజీ వ్యవస్థను బల్దియా చూసింది. ఇప్పుడు ఆ బాధ్యతలను వాటర్​బోర్డుకు బదిలీ చేసింది. మరోవైపు డ్రైనేజీ లీకేజీలపై జనాల నుంచి వచ్చే కంప్లయింట్స్​ని కూడా బల్దియా తీసుకోవడం లేదు. తమకేం  సంబంధం లేదని వాటర్​బోర్డుకు  కంప్లయింట్​ చేయాలని ఆఫీసర్లు సమాధానమిస్తున్నారు.  వాటర్​ బోర్డుకు కంప్లయింట్​ చేసిన వెంటనే స్పందించకపోతుండగా రోజురోజుకు సమస్య తీవ్రమవుతుంది.

అన్నిచోట్ల  అంతే..

జూబ్లీహిల్స్​ నుంచి బస్తీల వరకు అన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి ఇలాగే ఉంటున్నా  పట్టించుకోవడం లేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రమంజిల్​ నుంచి తాజ్​కృష్ణకు వచ్చే రూట్​లో రెండు డ్రైనేజీలు, మెహిదీపట్నం చౌరస్తా, మాసబ్​ట్యాంక్, రెడ్​హిల్స్,​ అశోక్​నగర్​, సరోజినిదేవి హాస్పిటల్​వద్ద, టోలిచౌకీ, ఫిలింనగర్​ బస్టాపు వద్ద, జూబ్లీహిల్స్​ అపోలో హాస్పిటల్​ వద్ద   డ్రైనేజీలు పొంగి రోడ్డుపై కిలో మీటర్ల మేర మురుగు పారుతోంది. సరూర్​ నగర్​, ఎల్​బీనగర్​, ఉప్పల్​ అన్నిచోట్ల డ్రైనేజీల పరిస్థితి ఇలాగే ఉంది. రోడ్లపై వరదల పారుతున్నా కూడా పట్టించుకోకపోవడంతో అధికారులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.