- డ్రగ్స్ కోసం దొంగలుగా, సప్లయర్లుగా మారుతున్రు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 7 వేల మంది డ్రగ్స్ వాడుతున్నారు. పోలీసులు గత ఏడాది కాలంలో 1,075 మందిని మాత్రమే ట్రేస్ చేయగలిగారు. వీరిలో కేవలం 80 మందిలోనే మార్పు వచ్చిందని, మిగతా వాళ్లంతా ఇంకా మత్తులోనే జోగుతున్నారని పోలీసులు చెప్తున్నారు. మత్తుకు బానిసలుగా మారిన యువత.. డ్రగ్స్ కోసం చివరకు దొంగలుగా, సప్లయర్ లుగా కూడా మారుతున్నారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా డ్రగ్స్ కన్జూమర్ల సంఖ్య పెరిగిపోతున్నది. నేటి యువత డ్రగ్స్ను స్టేటస్ సింబల్గా మార్చుకుంటున్నది. వీకెండ్స్ పార్టీల్లో లిక్కర్కు బదులు డ్రగ్స్కు ప్రయారిటీ ఇస్తోంది. ఎంజాయ్మెంట్ ముసుగులో జీవితాలను బలి చేసుకుంటోంది. యువతలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఐటీ ఎంప్లాయిస్ వరకు డ్రగ్స్ మత్తుకు బానిసలయ్యారు. ఇందులో ఎక్కువగా15 నుంచి 28 ఏళ్ల వయస్సు వాళ్లే ఎక్కువ.
గర్ల్స్ మానప్రాణాలు లెక్క చేయట్లే
డ్రగ్స్ బానిసలు తమతో పాటు ఫ్రెండ్స్ను మత్తు చైన్లోకి లాగుతున్నారు. కొందరితో మొదలై వేల సంఖ్యలో యువత బానిసలుగా మారారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తూనో లేక సప్లయ్ చేస్తూనో పోలీసులకు పట్టుబడుతున్నారు. డ్రగ్స్ కోసం దొంగతనాలు చేసి చేసి జైలు పాలవుతున్నారు. యువతులు మాన ప్రాణాలను సైతం లెక్కచేయడంలేదు. డ్రగ్స్ కోసం దేనికైనా రెడీ అంటున్నారు. దీంతో హైదరాబాద్లో డ్రగ్స్ కు డిమాండ్ పెరిగిపోయింది.
నిరుడు 2,495 మంది అరెస్ట్
గతేడాది 889 డ్రగ్స్ కేసుల్లో 2,495 మంది అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) గోవా, ముంబయిలోనూ సెర్చెస్ చేసింది. ఏడాది కాలంలోనే1,075 మందికి పైగా కన్జూమర్లను ట్రేస్ చేసింది.104 కేసులు రిజిస్టర్ చేసింది.13 మంది నైజీరియన్స్ సహా మొత్తం185 మంది డ్రగ్స్ సప్లయర్లు,10 మంది ట్రాన్స్పోర్టర్లను అరెస్ట్ చేశారు.
పోలీసులకు చిక్కింది 20 శాతమే
పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్లో 20 శాతమే డ్రగ్స్ కన్జూమర్లు చిక్కారు. వీరికి సిటీలోని 12 సెంటర్స్లో కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అందించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ తో పాటు మరో11 సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గతేడాది పట్టుబడిన 1,075 మందికి గాను 80 మంది కన్జూమర్లలోనే మార్పు వచ్చింది. మరో వెయ్యి మందిలో కనీసం 85 శాతం మంది డ్రగ్స్ మత్తు లేకుండా ఉండలేకపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా డార్క్వెబ్, ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తున్నారు. కొరియర్ ద్వారా డ్రగ్ పార్సిల్స్ తెప్పించుకుంటున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్లను సైతం డ్రగ్స్ ఇవ్వాలని వేడుకుంటున్నారు.
యువతలో మార్పు రావాలె
మా వద్దకు హై ప్రొఫైల్ కేసులే ఎక్కువగా వస్తుంటాయి.పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడంతో చాలా మంది డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ లేకపోతే ప్రాణం పోయినట్లు అరుస్తూ, పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ట్రీట్మెంట్కు సహకరించరు. యువతలో మార్పు వస్తేనే డ్రగ్స్ను అరికట్టడం సాధ్యం కాదు. - డాక్టర్ హరిణి, సైకియాట్రిస్ట్, హైదరాబాద్
ప్రజల సహకారం కావాలె
డ్రగ్స్ సప్లయర్లకు హైదరాబాద్ కస్టమర్స్ అంటే భయం కలిగేలా చేశాం. గోవా, ముంబై నుంచి సప్లయ్ చైన్ను బ్రేక్ చేశాం. ‘డేట్, రేప్, డ్రగ్స్’ పేరుతో దందా నడుస్తోంది. ఇందులో చిక్కుకున్న యువతులు అత్యాచారాలకు గురవుతున్నారు. 600 మంది డ్రగ్స్ బానిసలపై నిఘా పెట్టాం. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ మూలాలను నాశనం చేయవచ్చు. - సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్