సోషల్ మీడియా అకౌంట్లను దాస్తే నో వీసా .. రూల్స్‌‌‌‌ మరింత కఠినతరం చేసిన అమెరికా

సోషల్ మీడియా అకౌంట్లను దాస్తే నో వీసా .. రూల్స్‌‌‌‌ మరింత కఠినతరం చేసిన అమెరికా
  • డీఎస్‌‌‌‌160 వీసా అప్లికెంట్లు ఐదేండ్ల వివరాలు ఇవ్వాల్సిందే
  • ఎఫ్‌‌‌‌, ఎం, జే వీసాదారులకూ యూఎస్‌‌‌‌ కొత్త కండిషన్లు

వాషింగ్టన్: వీసా దరఖాస్తుదారులు సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు ఇవ్వాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. గడిచిన ఐదేండ్లలో అప్లికెంట్లు వాడిన ప్రతి సోషల్‌ మీడియాకు సంబంధించిన యూజర్‌‌ నేమ్‌లు, వివరాలు తప్పనిసరిగా వీసా అప్లికేషన్‌లో పేర్కొనాలని కండిషన్‌ పెట్టింది. లేదంటే వీసా తిరస్కరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో వీసాకు అప్లయ్‌ చేసుకున్నా వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించింది. డీఎస్‌160 వీసా దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు గురువారం యూఎస్‌ ఎంబసీ ప్రకటన రిలీజ్‌ చేసింది. జాతీయ భద్రతనుద్దేశించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘గడిచిన ఐదేండ్లలో ఫేస్‌బుక్, ఎక్స్‌, లింక్‌డ్ఇన్‌, యూట్యూబ్‌ వంటి ప్రతి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యూజర్‌‌నేమ్‌ లేదా ఐడీని డీఎస్‌160 వీసా దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొనాలి. తాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ పూర్తిగా వాస్తవం, సరైందేనని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి. సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు దాచిపెడితే వీసా తిరస్కరిస్తాం. భవిష్యత్తులో‌ వీసాలకూ అనర్హులవుతారు”అని యూఎస్‌ ఎంబసీ ఎక్స్ లో పోస్ట్‌ చేసింది. 

కొత్త రూల్స్‌ తక్షణమే అమల్లోకి.. 

ఎఫ్‌, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్‌ మీడియా ఖాతాల ప్రైవసీని పబ్లిక్‌గా ఉంచాలని అమెరికా కొత్త రూల్‌ తెచ్చింది. ఈ రూల్‌ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం సోషల్‌ మీడియా వెట్టింగ్ తప్పనిసరి అని తెలిపింది. ఈ మేరకు దరఖాస్తుదారులు వారివారి సోషల్‌ మీడియా అకౌంట్ల ప్రైవసీని మార్చుకోవాలని సూచించింది. ఎఫ్‌, ఎం కేటగిరీ వీసాలు స్టూడెంట్లకు, జే కేటగిరీ ఎక్ఛేంచ్‌ విజిటర్స్‌ కోసం జారీ చేస్తారు. తాజా రూల్‌ ప్రకారం.. ఈ కేటగిరీల వీసాలకోసం అప్లికేషన్‌ చేసినవాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్లను ఎంబసీ అధికారులు తనిఖీ చేసి, వీసా జారీ చేయొచ్చా లేదా అనేది డిసైడ్‌ చేయనున్నారు.