ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు స్కీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడక ముందు నవంబర్ నెలలో ఎండోమెంట్ ఆదాయం రూ. 49.27 కోట్లు ఉండేదని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో రూ. 93.27 కోట్లు, జనవరి నెలలో రూ.69 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అసెంబ్లీలో  సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వ వచ్చిన తర్వాత ఒకటో తేదీనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించామని చెప్పారు.   ప్రజా ప్రభుత్వం వచ్చి వంద రోజుల పాలన కాకముందే బీఆర్ఎస్ నాయకులు పిల్లి శాపనార్థలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 4 వేల 8 వందల కోట్లు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లకు విడుదల చేసిందని అన్నారు.

వచ్చి రెండు నెలలు అవుతుంది రైతుబంధు వేయలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారని బీఆర్ఎస్ హయాంలో నెలలు తరబడి రైతు బంధు వేయలేదని చెప్పారు.  2018-19లో యాసంగి పంటకు రైతు బంధు ఐదు నెలలు వేశారని అన్నారు. 2019-20లో 9 నెలలు, 2020-21లో నాలుగు నెలలు, 2022-23లో నాలుగు నెలలు వేశారని తెలిపారు. రైతు బంధు గురించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.