నెరవేరని సీఎం హామీ.. మూలుగుతున్న ప్రగళ్లపల్లి లిఫ్ట్ ప్రపోజల్స్

నెరవేరని సీఎం హామీ.. మూలుగుతున్న ప్రగళ్లపల్లి లిఫ్ట్  ప్రపోజల్స్

భద్రాచలం, వెలుగు: 29 వేల ఎకరాల గిరిజనుల భూములకు సాగునీరు, 12 వేల ఎకరాల తాలిపేరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రతిపాదించిన దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి లిఫ్ట్  ప్రపోజల్స్​ పెండింగ్​లోనే ఉన్నాయి. లిఫ్ట్  పనులు చేపడతామని, బడ్జెట్​లో నిధులు కేటాయిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆగమేఘాల మీద ఇరిగేషన్​ ఇంజనీర్లు సర్వే చేసి ప్రపోజల్స్ రెడీ చేసి పెట్టారు. కానీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ హామీని మరిచిపోయింది. ప్రపోజల్స్ ఆఫీసుల్లో మూలుగుతుంటే ఎప్పటిలాగే గిరిజనుల పంటలు ఎండిపోతున్నాయి. 

తలాపునే గోదారి ఉన్నా..

]దుమ్ముగూడెం మండల కేంద్రంలో బ్రిటిష్​ కాలంలో కాటన్​ దొర గోదావరిపై ఆనకట్ట కట్టారు. నిత్యం సమృద్ధిగా జలాలు పారుతూనే ఉంటాయి. అయితే గోదావరి పక్కనే ఉన్న ఆదివాసీలకు తాగునీరు అందని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే గిరిజన రైతులు ప్రగళ్లపల్లి వద్ద లిఫ్ట్  ఏర్పాటు చేసి ఛత్తీస్​గఢ్​ సరిహద్దున ఉన్న గూడేల వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే నాటి సీఎం వైఎస్సార్​​లిఫ్ట్​ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రగళ్లపల్లి వద్ద లిఫ్ట్  కట్టి అక్కడి నుంచి బైరాగులపాడు, కమలాపురం, అంజుపాక, మహదేవపురం, దబ్బనూతల, కొత్తూరు, ఆర్లగూడెం, లచ్చిగూడెం, భీమవరం, మారాయిగూడెం, సింగవరం, గంగవరం, జిన్నెగట్టు, పత్తిపాక వరకు 21 కి.మీల మేర పైపులైన్​ నిర్మించి సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

మిత్రుడి విజ్ఞప్తితో..

దుమ్ముగూడెం మండలం చినబండిరేవుకు చెందిన సాగి శ్రీనివాసరాజు వ్యవసాయంలో రాణిస్తున్నాడని తెలుసుకుని సీఎం కేసీఆర్​ తన ఫాంహౌస్​కు పిలిపించుకున్నారు. అక్కడ నాలుగు రోజుల 
పాటు ఉన్న శ్రీనివాసరాజు ఇక్కడి గిరిజనుల బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హుటాహుటిన సీఎం సర్వేకు ఆదేశించారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్​లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్​రావు కూడా స్వయంగా ప్రకటన చేశారు. ఇరిగేషన్​ ఇంజనీర్లు సర్వే చేసి రూ.645 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేశారు. అయితే ఆ ప్రపోజల్స్​  ఆఫీసర్ల వద్దే 
మూలుగుతున్నాయి. 

సర్వే చేసిన మాట వాస్తవమే

ప్రగళ్లపల్లి లిఫ్ట్ కు సంబంధించిన సర్వే చేసిన మాట వాస్తవమే. ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసినం. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టినం. 
- శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ, ఇరిగేషన్​

కన్నీటి కష్టాలు తీరేదెన్నడో?

50 గిరిజన గ్రామాల రైతులు ఏళ్ల తరబడి వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నం. గోదావరి పక్కనే ఉన్నా సాగునీరు లేక పంటలు ఎండబెట్టుకుంటున్నం. ఈ కన్నీటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో? 
- యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి