డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ

త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా ఇకపై బ్రాండ్ పేరు ఉండనుంది. మహిళల వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబులింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సంస్థతో ఒప్పందం జరిగింది. అమెజాన్ వంటి ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్ణయించారు. 

సెర్ప్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాలు చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయని, వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. డిమాండ్ కు తగ్గట్లుగా మరింత ఆకర్షణీయంగా లేబులింగ్, ప్యాకింగ్ చేస్తూ, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే, మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి, కొనుగోలు బాగా సాగి, లాభదాయకంగా ఉండనుందన్నారు. ఆ తర్వాత అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని.. మరింతగా వ్యాపారం చేయవచ్చని చెప్పారు. 

ఇప్పటికే సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రానికి మరే రాష్ట్రం సాటిరాదని చెప్పారు. ఈ దశలో మన తెలంగాణ పేరు ప్రతిష్ఠలు ఉట్టి పడేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముడుపోయేలా ఈజీ గా, క్యా చీగా ఉండేట్లుగా బ్రాండింగ్ ఉండాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో  కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.