
Railway News: దేశంలో కోట్ల మంది ప్రజలు నిరంతరం తమ ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలను వినియోగిస్తుంటారు. అయితే కొన్ని చివరి నిమిషం ప్రయాణాల కోసం చాలా మంది తత్కాల్ టిక్కెట్లపై ఆధారపడుతుంటారు. వీటిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తప్పుడు పత్రాలతో తత్కాల్ టిక్కెట్లను ఏజెంట్లు బుక్కింగ్ చేయటాన్ని అరికట్టడానికి చర్యలు రానున్నాయి.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు అందేలా చేసేందుకు ఈ-ఆధార్ వెరిఫికెషన్ బుక్కింగ్ సమయంలో తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ఐఆర్సీటీసీ పోర్టల్ నుంచి అనధికారిక ఆటోమేటెడ్ టిక్కెట్ బుక్కింగ్ లను నివారించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రైల్వే సంస్థ ఏఐ టూల్ ద్వారా అనధికారికంగా ఉన్న 2 కోట్ల 50లక్షల యూజర్ ఐడీలను రద్దు చేసినట్లు పేర్కొంది.
Bharatiya Railways will soon start using e-Aadhaar authentication to book Tatkal tickets.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2025
This will help genuine users get confirmed tickets during need.
వాస్తవానికి తత్కాల్ టిక్కెట్లను పొందటం అనేది చివరి క్షణాల్లో పెద్ద సమస్యనే చెప్పుకోవాలి. బుక్కింగ్స్ ఓపెన్ కాగానే క్షణాల్లోనే టిక్కెట్లు ఖాళీ కావటం చాలా మందిని నిరాశకు గురిచేస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులు 60 రోజులు ముందుగనే టిక్కెట్లను అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకునేందుకు వీలు కల్పించబడుతోంది. వీటిలో దాదాపు 20 శాతం టిక్కెట్లు తత్కాల్ మార్గం ద్వారా విక్రయించబడుతుంటాయి. చివరి నిమిషాల్లో ప్రయాణానికి ఇవి దోహదపడుతుంటాయి.
తత్కాల్ టిక్కెట్లు ప్రయాణానికి ఒక్క రోజు ముందుగానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏసీ క్లాస్ ప్రయాణికులకు ఉదయం 10 గంటల నుంచి, నాన్ ఏసీ తరగతి ప్రయాణికులకు టిక్కెట్లు ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకునేందుకు వీలు కల్పించబడింది. ప్రస్తుతం చాలా చోట్ల ఈ టిక్కెట్లను ట్రావెల్ ఏజెంట్లు ఆటోమేట్ చేయబడిన బుక్కింగ్ విధానాలను ఉపయోగించి కొనుగోలు చేస్తూ వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే భారతీయ రైల్వే సంస్థ కొత్తగా ఈ-ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని చూస్తోంది.