అన్నపై పోటీకి సిద్దమైందా - షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ...!

అన్నపై పోటీకి సిద్దమైందా - షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ...!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీకి దిగుతారని, ఈ మేరకు అధిష్టానం కూడా ఓ నిర్ణయానికి వచ్చిందని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఇటీవలే కడప ఎంపీ స్థానానికి వైసీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ప్రకటించటంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో షర్మిల ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

ఒకవేళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే హోరాహోరీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా జగన్ కు వ్యతిరేకంగా తమ స్వరం వినిపిస్తోన్న వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతలను కాంగ్రెస్ తరఫున పోటీ చేయించే ప్రయత్నం జరుగుతోందని టాక్ ఉన్న నేపథ్యంలో షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.