
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయ్యింది. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజూమున 3.54 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు.. భూమికి 10 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం ముల్తాన్ నగరానికి పశ్చిమాన 149 కి.మీ దూరంలో ఉందని తెలిపింది.
గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టారు అధికారులు.
భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఉండటంతో ఆ దేశంలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు నెలల వ్యవధిలోనే దాదాపు ఐదు నుంచి ఆరు సార్లు పాకిస్థాన్లో భూకంపాలు సంభవించాయి.