అసెంబ్లీలో ముందుండి కొట్లాడిండు 

అసెంబ్లీలో ముందుండి కొట్లాడిండు 

రోశయ్య సీఎం అయ్యాక అసెంబ్లీలో జరిగిన అనేక చర్చల్లో తెలంగాణవాదాన్ని ఈటల గెలిపించారు. పదునైన ఉపన్యాసాలతో అసెంబ్లీని ఆలోచింపజేశారు. ఉద్యమం జోరందుకునే నాటికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణకు నిధుల విషయంలో ఈటల వేసిన ప్రశ్నలకు కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమివ్వలేక ఫ్రస్టేషన్ కు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ‘ఇగ రాసి పెట్టుకో.. ఒక్క రూపాయి కూడా ఇయ్యం. ఏం చేసుకుంటావో చేసుకో’ అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే.. ‘తక్షణమే సీఎం క్షమాపణ చెప్పాలి’ అంటూ ఈటల ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం రానిచ్చేది లేదంటే.. ‘రాష్ట్రం నీ అయ్య జాగీరా’ అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన రోజు నుంచే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం నుంచి మొదలుకొని స్పీకర్ చాంబర్ ఎదుట ఆందోళనలు, వాకౌట్ల వరకూ అన్నింట్లోనూ ఈటల ముందుండి కొట్లాడారు.   

వెయ్యి మంది అమరుల పాడె మోసిండు  

తెలంగాణ ఉద్యమ సమయంలో గుండె పగిలి, రాష్ట్రం రాదేమోనని సుమారు 2 వేల మంది ఆత్మ బలిదానం చేసుకున్నరు. రాష్ట్రంలో ఏ మూలన ఆత్మార్పణం జరిగినా టీఆర్ఎస్ తరఫున వారి అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబాలకు ఈటల ధైర్యం చెప్పారు. ఏనాడూ కేసీఆర్ ఇల్లు కదలకపోయినా టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఈటలనే రాష్ట్రమంతా పర్యటించారు. సుమారు వెయ్యి మంది అమరుల అంతిమయాత్రల్లో పాల్గొని వాళ్ల పాడెలను భుజాన మోశారు.