
- 100% ఆధారాలు ఉన్నాయన్న లోక్ సభ ప్రతిపక్ష నేత
- ఖండించిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం చీటింగ్కు అనుమతిస్తున్నట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. కర్నాటక లోక్సభ ఎన్నికల్లో ఓ నియోజకవర్గమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కర్నాటకలోని ఓ లోక్సభ నియోజకవర్గంలో మేం పరిశీలించినప్పుడు భారీ అక్రమాలు బయటపడ్డాయి. అక్కడ అర్హత లేని వేల సంఖ్యలో కొత్త ఓటర్లను జాబితాలో ఈసీ చేర్చింది. ఇది పక్కా చీటింగ్. దీనికి సంబంధించి 100 శాతం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.
మహారాష్ట్రలో ఇలానే అక్రమాలకు పాల్పడ్డారు” అని దుయ్యబట్టారు. త్వరలో జరిగే బిహార్ ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు అర్థమవుతున్నదని రాహుల్ అన్నారు.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ స్వతంత్రంగా పనిచేయడం లేదని, దేశంలో ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని ఆరోపించారు. తాము వదిలిపెట్టబోమని రాహుల్ హెచ్చరించారు. దీనికి ఈసీ బదులిస్తూ.. రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఓ ప్రకటనలో పేర్కొంది.
‘‘కర్నాటకలోని సదరు నియోజకవర్గంలో అక్రమాలు జరిగి ఉంటే ఎన్నికలు జరిగిన 45 రోజుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలా పిటిషన్ ఏమైనా ఉంటే చెప్పండి? నిరాధార ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు” అని తెలిపింది.