న్యూఢిల్లీ: దేశంలో రెండో విడతలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మరో వారంపాటు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్లో తనిఖీ చేసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రెండో దశలో చత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి.. మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ నిర్వహిస్తున్నది.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఎన్యుమరేషన్ప్రక్రియ గడువు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్11కి మారింది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ డిసెంబర్ 9కి బదులుగా డిసెంబర్ 16న ప్రచురిస్తారు. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7కి బదులుగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. సర్ కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సర్ ప్రక్రియ కొనసాగుతుండగా.. గడువు ఒత్తిడి తట్టుకోలేక 40 మంది బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) మరణించారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది.
