- మహిళలను కించపరిచే కామెంట్లపై ఆగ్రహం
- ఇక నుంచి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని వెల్లడి
- బీజేపీ, కాంగ్రెస్ చీఫ్లకు వార్నింగ్ నోటీస్ కాపీ
న్యూఢిల్లీ : మహిళలను కించపరిచేలా కామెంట్లు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనతేలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. సోమవారం నుంచి పబ్లిక్ డొమైన్లో వాళ్లు మాట్లాడే మాటలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అతిక్రమించకుండా, ఎవరినీ అవమానించేలా మాట్లాడకుండా పార్టీ నేతలకు అవగాహన కల్పించాలని బీజేపీ, కాంగ్రెస్పార్టీల అధ్యక్షులకు ఆ నోటీస్ల కాపీని పంపించింది. ‘ఎన్నికల ప్రచారంలో, పబ్లిక్ డొమైన్లో, ప్రజలతో ఇంటారాక్ట్ అయినప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు అభ్యంతరకరమైన వాఖ్యలకు చేయకుండా జాగ్రత్తలు చెప్పండి.
ఎన్నికల కోడ్ అనుసరించాలని తెలియజేయండి. ప్రచారంలో చేసే అభ్యంతరకరమైన కామెంట్లు ఒక చైన్ రియాక్షన్లా మారతాయి’’ అని బీజేపీ, కాంగ్రెస్ చీఫ్లకు తెలియజేసింది. తమ నోటీసులకు ఘోష్, సుప్రియ ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందలేదని, వారు ‘చాలా తక్కువ స్థాయి’లో ఆయా నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కామెంట్లు చేశారని పేర్కొంది. ఇది ఎన్నికల నియామావళిని అతిక్రమించడమేనని, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఈసీ చెప్పింది. ఇలాంటి టైంలో మహిళలను తక్కువచేసేలా, వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఇబ్బంది పడేలా కామెంట్లు చేయడాన్ని సహించబోమని తెలిపింది.