హిండాల్కో చైర్మన్ కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ/చెన్నై: కరోనా లాక్ డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీకి నష్టం తప్పదని హిం డాల్కో ఇండస్ట్రీస్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. కరోనా అతిపెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ ను తీసుకొచ్చిందని చెప్పారు. ఇండియా ఎకానమీ నెమ్మదిస్తున్నప్పుడే ఈ వైరస్ దాడి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మన జీడీపీలో 80 శాతం జిల్లాల నుంచి వస్తుంది. వీటిలో చాలా వరకు లాక్డౌన్ సమయంలో రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. దీంతో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి’’ అని షేర్ హోల్డర్లకు రాసిన లెటర్ లో బిర్లా పేర్కొన్నారు. మంచి ఫండమెంటల్స్, నాయకత్వం ఉన్న కంపెనీలు విజేతలుగా నిలుస్తాయని కామెంట్ చేశారు. కరోనా వల్ల అన్ని సెక్టార్లూ దెబ్బతిన్నాయని, చాలా మంది జాబ్స్ పోయాయని బిర్లా పేర్కొన్నారు. ఎయిర్ లైన్స్, టూరిజం వంటి సెక్టార్ లు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని స్పష్టం చేశారు.
వ్యాపార విధానాలు మారాలి: హిందుజా
కరోనా వల్ల ఏర్పడ్డ క్రైసిస్ నుంచి బయటపడాలంటే వ్యాపార విధానాలను మరోసారి పరిశీలించుకోవాలని, నిర్వహణా విధానాలనూ మార్చుకోవాలని హిం దుజా గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అశోక్ లేలాండ్స్ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు. ఈ దిశగా తమ కంపెనీ కొన్ని నిర్ణయాలను తీసుకుందని, తగినంత గ్రోత్ ను సాధిస్తామని అన్నారు. కరోనా కొనసాగుతున్నప్పటికీ కమర్షియల్ వెహికిల్ సెక్టార్ భవిష్యత్ బాగానే ఉంటుందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని షేర్ హోల్డర్లను ఉద్దేశించి హిందుజా అన్నారు.