గాంధీనగర్: గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా మాజీ కలెక్టర్ రాజేంద్రకుమార్ పటేల్( 2015 ఐఏఎస్ బ్యాచ్ )ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆయన లంచం తీసుకుని భూమి వినియోగ మార్పు దరఖాస్తులను క్లియర్ చేశారని ఈడీ ఆరోపించింది. అప్లికేషన్లను స్వీడ్ గా ఆమోదించడం కోసం సిస్టమాటిక్గా లంచాలను వసూలు చేసినట్టు తెలిపింది.
సురేంద్రనగర్ కలెక్టరేట్ ఆఫీస్లో భారీగా అవినీతి జరుగుతోందని పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 23న డిప్యూటీ మామ్లతాదర్(రెవెన్యూ ఆఫీసర్) చంద్రసింగ్ మోరిని అధికారులు మొదట అరెస్ట్ చేశారు.
అతని ఇంటి నుంచి రూ.67.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు అంతా లంచం డబ్బేనని మోరి ఒప్పుకున్నట్టు ఈడీ తెలిపింది. భూమి పరిమాణం (స్క్వేర్ మీటర్లలో) ఆధారంగా లంచాన్ని నిర్ణయించి మరీ వసూలు చేశారని ఈడీ పేర్కొంది.
