
- రాజకీయాలకోసం దర్యాప్తు సంస్థను వాడుకునుడేందని ప్రశ్న
- లాయర్లకు నోటీసులు పంపడంపైనా ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ
న్యూఢిల్లీ: క్లయింట్లకు సూచనలు, సలహాలు ఇచ్చినందుకు న్యాయవాదులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని కామెంట్ చేసింది. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తాయని, న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. మనీలాండరింగ్ కేసులో తమ క్లయింట్లకు సూచనలు చేసినందుకు సీనియర్ లాయర్లు అరవింద్ దత్తార్, ప్రతాప్ వేణుగోపాల్కు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
ఈ కేసును సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం సుమోటోగా తీసుకుని సోమవారం విచారణ జరిపింది. ‘‘లాయర్, క్లయింట్ మధ్య సంభాషణ గోప్యమైనది. అందుకు నోటీసులు జారీ చేయడం సరికాదు. ఈడీ అన్ని హద్దులు దాటుతోంది” అని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగకూడదని, పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాల్సిందేనని ఆదేశించారు. నోటీసులివ్వడం కేవలం న్యాయవాదులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, న్యాయవ్యవస్థకూ హానికరమని అన్నారు. న్యాయవాదులు మనస్సాక్షితో, భయం లేకుండా వారి వృత్తిపరమైన విధులు నిర్వర్తించే సామర్థ్యం ప్రమాదంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈడీ తీరును ప్రత్యక్షంగా గమనిస్తున్నాం..
అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశంపై అత్యున్న త స్థాయిలో చర్చించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపా రు. చట్టపరమైన సలహాలు ఇచ్చినందుకు లాయ ర్లకు సమన్లు జారీ చేయొద్దని ఈడీకి ఇదివరకే సూచించామని వివరించారు. కేంద్ర సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు తప్పుడు కథ నాలు సృష్టిస్తున్నారని మెహతా అన్నారు. అందు కు ప్లాన్ ప్రకారం ప్రయత్నం జరుగుతోందని, ఇంటర్వ్యూలు, వార్తలను పట్టించుకోవద్దని సీజేఐని తుషార్ మెహతా కోరారు. అందుకు సీజేఐ స్పందిస్తూ, ‘‘మేము మీడియా కథనాల ఆధారంగా ఆలోచన చేయట్లేదు.
పలు కేసుల్లో ఈడీ హద్దు మీరడం స్పష్టంగా చూస్తున్నాం” అని స్పష్టం చేశారు. అలాగే, బెంగాల్, కర్నాటక లోని పలు కేసులను సీజేఐ ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై పోరాటాలకు ఈడీని ఎలా వాడు కుంటారని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర పరిశీలనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో పాటు పలు పార్టీలను ఆదేశించారు.
వాదనల అనంత రం జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా సీజేఐ గవాయ్తో ఏకీభ వించారు. వార్తా కథనాలు అంతటా కొనసాగు తాయని, వాటిని చూసినంతమాత్రాన ప్రభావితం అయినట్లు ఎలా చెప్తారని తుషార్ మెహతాను ప్రశ్నించారు. తీర్పులు సోకాల్డ్ కథనాలతో ప్రభావితం కాకుండా వాస్తవాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. విచారణను జులై 29కి వాయిదా వేశారు.