
మహేశ్వరం: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయుల చేత బోధన నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే నాణ్యమైన బోధన అందించనున్నట్లు స్పష్టం చేశారు. స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నామన్న మంత్రి... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నామని చెప్పారు. రంగు రంగుల బొమ్మలతో పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...