- పిల్లల జనాభాలో 2-3% మంది హాస్పిటలైజ్ అవొచ్చు
- చిన్నారులు వైరస్ బారిన పడకుండా చర్యలు చేపడ్తున్నం
- నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మున్ముందు మార్పు చెందుతుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్న టైమ్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైరస్ మార్పు చెందితే దేశంలోని పిల్లల జనాభాలో 2 నుంచి 3 శాతం మంది హాస్పిటలైజ్ అవ్వొచ్చని చెప్పింది. దీనిపై ఇప్పటికే దృష్టి పెట్టామని నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు. ‘సాధారణంగా పిల్లల్లో చాలా తక్కువగా కరోనా ఇన్ఫెక్షన్ సోకుతుంది. లక్షణాలు పెద్దగా కనిపించవు. వాళ్లలో కరోనా సీరియస్ స్థాయికి ఇప్పటికైతే చేరలేదు. అయితే వైరస్ మారితే మాత్రం చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపే చాన్స్ ఉంది. పిల్లల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం’ అని పాల్ చెప్పారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.
అన్లాక్ ఇట్ల చేయాలె
కరోనా కేసులు తగ్గుతుండటంతో ఢిల్లీ సహా చాలా రాష్ట్రాలు అన్లాకింగ్ ప్రక్రియ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అన్లాక్ చేసే విధానంపై హెల్త్ మినిస్ట్రీ గైడ్లైన్స్ విడుదల చేసింది. వారం రోజులుగా పాజిటివ్ రేటు 5 శాతం లోపు నమోదవుతుంటే, వల్నరబుల్ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ వేస్తే అలాంటి జిల్లాల్లో అన్లాక్ స్టార్ట్ చేయొచ్చని చెప్పింది. అలాగే కొవిడ్ కేర్కు సంబంధించి కమ్యూనిటీ బాధ్యత తీసుకోవాలంది. మరోవైపు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల డోసుల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. రెండింటినీ రెండు డోసులుగా వేసుకోవాలంది. కొవిషీల్డ్ను 12 వారాల తర్వాత, కొవాగ్జిన్ను ఎప్పటిలాగే 4 వారాల తర్వాత వేసుకోవాలని చెప్పింది.