వరంగల్, వెలుగు: ఓరుగల్లులో యువత, మహిళల స్వయం ఉపాధి కోసం నెక్ (ఎన్ఈసీసీ) ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ప్రదీప్రావు వందలాది మందికి ఉచితంగా ఎగ్ కార్ట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. బుధవారం ఆయన వరంగల్ తూర్పు ఓసిటీలో ప్రదీప్రావు అధ్యక్షతన దాదాపు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రారావు మాట్లాడుతూ ఎగ్ కార్ట్స్ ద్వారా 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా చిరువ్యాపారులు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు.
వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. బీజేపీతోనే గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ ఓరుగల్లులోని చిరువ్యాపారులు ఆర్థికంగా ఎదగాలనే ఇప్పటివరకు 750 కుటుంబాలకు నెక్ తరఫున ఎగ్ కార్ట్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉండే ఎంజీఎం హాస్పిటల్ సమస్యల వలయంలో ఉంటే మంత్రి కొండా సురేఖ కనీసం దాని అభివృద్ధి కోసమొచ్చే హెల్త్ మినిష్టర్ను కూడా ఇప్పటివరకు జిల్లా పర్యటనకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే వర్షాకాలంలోనూ తూర్పు జనాలకు మరోసారి పడవల ప్రయాణం తప్పేలా లేదని విమర్శించారు.

