హైదరాబాద్ లో తొలగుతున్న ఫ్లెక్సీలు .. తెరుచుకున్న చెక్​పోస్టులు

హైదరాబాద్ లో తొలగుతున్న ఫ్లెక్సీలు .. తెరుచుకున్న చెక్​పోస్టులు
  • ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  రంగంలోకి దిగిన ఆఫీసర్లు
  • వెహికిల్స్ తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • లిక్కర్, నగదు రవాణాపై నిఘా
  • ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తీసేస్తున్న సిబ్బంది
  • నాయకుల విగ్రహాలకు ముసుగులు

నెట్​వర్క్​, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రావడంతో సోమవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్​ యంత్రాంగం రంగంలోకి దిగింది. స్టేట్​లోకి ఎంటరయ్యే అన్ని అంతర్రాష్ట్ర బార్డర్లతో పాటు జిల్లాల బార్డర్లలో పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటుచేశారు. లిక్కర్​, నగదు రవాణాపై ఆంక్షలు ఉండడంతో అన్ని రకాల వాహనాలను చెక్​ చేస్తున్నారు.  ఆయా చెక్​ పోస్టుల్లో లోకల్​ పోలీసులతో పాటు సీఆర్​పీఎఫ్​ జవాన్లకు డ్యూటీలు వేశారు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో  సర్కారు స్కీములకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, సీఎం కేసీఆర్​,  మంత్రుల ఫొటోల తొలగింపు మొదలుపెట్టారు.

 గ్రామాల్లో పంచాయతీ, అర్బన్​ ఏరియాల్లో మున్సిపల్​, కార్పొరేషన్​ సిబ్బంది రంగంలోకి దిగి, ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, నేతల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు.  ఎన్నికల కోడ్​పై నియోజకవర్గాలవారీగా ఇప్పటికే పొలిటికల్​ పార్టీల లీడర్లకు అవగాహన కల్పించిన కలెక్టర్లు, పోలీస్ ​ఆఫీసర్లు తాజాగా షెడ్యూల్ ​వెలువడిన వెంటనే మరోసారి జిల్లాల వారీగా ప్రెస్​మీట్లు పెట్టి మరీ ఎన్నికల నియమావళి గురించి  వివరించారు. కోడ్​ ఆఫ్​ కండక్ట్​ను ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నేతలు ప్రచారం కోసం వాడే వెహికిల్స్​, మైకులు, సౌండ్​బాక్సుల కోసం ముందస్తుగా పర్మిషన్​ తీసుకోవాలని సూచించారు. 

భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్​..

పొరుగు రాష్ట్రాల నుంచి  భద్రాచలం ఏజెన్సీలోకి  ప్రవేశించే  రహదారులను పోలీసులు చక్రబంధనం చేశారు. కూనవరం రోడ్డులో చెక్​పోస్ట్​ ఏర్పాటుచేసి ఆంధ్రా,చత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రంలోకి లిక్కర్, నగదు రవాణా జరకుండా చర్యలు తీసుకుంటున్నారు. చర్ల రోడ్డులో ఆంధ్రా-–తెలంగాణ బోర్డర్​లోనూ చెక్​ పోస్టు పెట్టారు. ఈ ఏరియా నుంచి ఎన్నికల కోసం గుడుంబా, ఇతర రాష్ట్రాల మద్యం వచ్చే అవకాశం ఉన్నందున నిఘా పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ప్రవేశించే ప్రమాదం ఉందనే ఇంటెలిజెన్స్​ రిపోర్టులతో  కొత్త వ్యక్తుల ప్రవేశంపై దృష్టిపెడ్తున్నారు.

లిక్కర్​, మనీలాండరింగ్​పై నిఘా పెట్టాం: డీజీపీ అంజనీ​కుమార్​

మహదేవపూర్:  కోడ్ అమల్లోకి వచ్చినందున లిక్కర్, డ్రగ్స్​, మనీ లాండరింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఎక్కువ నిఘా పెడ్తామని,  అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీ కుమార్​ హెచ్చరించారు. డీజీపీ సోమవారం స్టేట్ బోర్డర్ లో ఉన్న  కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి చెక్ పోస్ట్ , మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్​ అండ్​ అవుట్ పోస్ట్ లను పరిశీలించి పోలీస్ ఆఫీసర్లకు, సిబ్బందికి సూచనలిచ్చారు. 

కాళేశ్వరం టెంపుల్​లో  స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్థానిక పోలీస్‌‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమకు సహకరిస్తూ  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలియజేయాలని కోరారు. వెంట డీఎస్పీ రామ్మోహన్, మహాదేవపూర్ సీఐ కిరణ్ కుమార్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, మహాదేవపూర్ ఎస్ఐ రాజ్ కుమార్  ఉన్నారు.